రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా వివిధ గృహనిర్మాణ పథకాల కింద రుణం పొంది ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని స్వచ్ఛందంగా అమలు చేస్తామంటూనే... దొడ్డిదారిలో వసూలుకు వారిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. పథకంపై లబ్ధిదారులకు అయిష్టత ఉంటే వాలంటీర్ల సర్వేలో 'నాట్ విల్లింగ్' ఆప్షన్ ఉండేది. రెండు రోజుల క్రితం దాన్ని తొలగించారు. ఇళ్ల దగ్గరకు వెళ్లి లబ్ధిదారులు/కొనుగోలుదారుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని వాలంటీర్లకు స్పష్టం చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం వివరాల నమోదు పత్రంలో లబ్ధిదారులు సంతకం చేయకపోయినా ఫర్వాలేదని, వారిపై ఒత్తిడి ఉండదని చెబుతున్నారు.
లబ్ధిదారులు ముందుకు రారనే...
1983 నుంచి 2011 ఏడాది వరకు ఓటీఎస్ పథకానికి 46 లక్షల మంది అర్హులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా వీరిలో 40 లక్షల మంది వివరాలే అధికారుల వద్ద ఉన్నాయి. వాటిని సరిపోల్చుకునేందుకు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్లతో సర్వే చేయిస్తున్నారు. లబ్ధిదారులు/కొనుగోలుదారుల వివరాలు, వారసులు, స్థలం సర్వే నంబరు, విద్యుత్తు మీటరు నంబరు, ఇంటి హద్దులు, విస్తీర్ణం, తదితర వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 8 లక్షల మంది వివరాలను నమోదు చేయగా 35వేల మంది ‘నాట్ విల్లింగ్’ ఆప్షన్ను ఎంచుకున్నారు. ఈ ఆప్షన్ను కొనసాగిస్తే మరింత మంది దీని వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే ఆలోచనతోనే ఆప్షన్ తొలగించినట్లు క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం.. నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన వారు మున్ముందు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే మళ్లీ సర్వే చేయించాలని, అందుకే ఆప్షన్ తొలగించామని చెబుతున్నారు. ఈ ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారుల జాబితాను మళ్లీ వాలంటీర్లకు పంపించారు. వారి వివరాలూ నమోదు చేయాలని స్పష్టం చేశారు.
అసెస్మెంట్ నంబర్లే లేనివి 35%
ఇప్పటివరకు చేపట్టిన సర్వేలో 35% ఆస్తుల అసెస్మెంట్ నంబర్లు లేవు. దాదాపు 2.8 లక్షల మంది నంబర్లు అందుబాటులో లేవు. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. వీటినీ వెనక్కి పంపి రీ సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలే లేనివి 1.50 లక్షలు
రాష్ట్రస్థాయి నుంచి అధికారులు పంపిన డేటా ప్రకారం చేపట్టిన సర్వేలో సుమారు 1.50 లక్షల మంది వివరాలు లభించలేదు. కొంతమంది చనిపోయారని, వారి వారసులు ఎవరూ లేరని, కొన్నిచోట్ల అసలు ఇళ్లే లేవని, మరికొందరు వలస వెళ్లారని సర్వేలో నమోదుచేశారు. మరికొందరి వివరాలు నాట్ ట్రేసబుల్ అని రాశారు.
ఇదీ చదవండి: మహనీయుల త్యాగాల స్ఫూర్తితో.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దాం: జగన్