ETV Bharat / city

Farmers: కౌలు ‘పాశమే’.. అప్పుల ఊబిలోకి అన్నదాతలు

Farmers: కూలి పనులు చేస్తూనే ఏదో ఒక పంట వేస్తే కుటుంబ ఆదాయం పెరుగుతుందనే ఆశ వారిని కౌలు రైతులుగా మార్చింది. తమ కష్టం బిడ్డలకు రాకూడదనే ఆలోచన వారిది. కూలి ద్వారా సంపాదించిన సొమ్ముతోపాటు వ్యాపారులు, భూయజమానుల నుంచి అప్పు తీసుకుని పొలంపై పెడుతున్నారు. వర్షాలు, వరదలు, తెగుళ్లతో దిగుబడులు రాక పంట దెబ్బతిని నష్టపోతున్నారు. అప్పుల ఊబిలోకి చేరుతున్నారు. కొందరు అప్పులు తీర్చే దారి కన్పించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

author img

By

Published : Jul 13, 2022, 8:00 AM IST

farmers committing suicide due to unpayable debts
కౌలు ‘పాశమే’.. అప్పుల ఊబిలోకి అన్నదాతలు

Farmers: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో కౌలు రైతు వరికుంట ఏసుబాబు(35)కు వ్యవసాయంలో రూ.4లక్షల వరకు అప్పులై తీర్చే దారి కానరాక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కౌలుకార్డు లేదంటూ పరిహారం తిరస్కరించారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఈ నెల 4న తమ ఇంటికి వచ్చిన జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు బాధిత కుటుంబీకులు తమ సమస్య వివరించగా.. ‘కౌలు రైతు అని చెబుతున్నా.. పంట సాగుపత్రం లేదంటున్నారు.

ప్రభుత్వ సాయం ఎలా మంజూరవుతుంది? ఏం చేయలేం’ అని స్పష్టం చేశారు. ఏసుబాబు కుటుంబమే కాదు.. రాష్ట్రంలో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో 90% మంది పరిస్థితి ఇదే. వాస్తవ సాగుదారులనే ఈ-క్రాప్‌లో నమోదు చేస్తున్నామని చెప్పే వ్యవసాయశాఖకు.. ఇలాంటివారంతా ఎందుకు కౌలు రైతులుగా కన్పించడం లేదో మరి?

కూలి పనులు చేస్తూనే ఏదో ఒక పంట వేస్తే కుటుంబ ఆదాయం పెరుగుతుందనే ఆశ వారిని కౌలు రైతులుగా మార్చింది. తమ కష్టం బిడ్డలకు రాకూడదనే ఆలోచన వారిది. అందుకే ఉన్న ఊళ్లోనే తెలిసిన రైతులనుంచో, తాము కూలి పనులు చేసే భూయజమానులనుంచో కొద్దిపాటి భూమిని కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిరప ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కూలి ద్వారా సంపాదించిన సొమ్ముతోపాటు వ్యాపారులు, భూయజమానుల నుంచి అప్పు తీసుకుని పొలంపై పెడుతున్నారు.

వర్షాలు, వరదలు, తెగుళ్లతో దిగుబడులు రాక పంట దెబ్బతిని నష్టపోతున్నారు. అప్పుల ఊబిలోకి చేరుతున్నారు. సొంత భూములుంటే వాటిని అమ్మి అప్పు తీరుస్తామనే ధైర్యం ఉంటుంది. కౌలు రైతుల్లో చాలామంది సెంటు భూమి లేని వారే. దీంతో కొందరు కూలీలుగా మారుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చే దారి కన్పించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2019 జూన్‌ నుంచి 2022 మార్చి మధ్యలో ఆత్మహత్య చేసుకున్న 852 మంది రైతు కుటుంబాలను పరిశీలించగా 45%మంది కౌలు రైతులే. వీరిలో 90% మందిని గుర్తింపు కార్డులు లేవంటూ కౌలు రైతులుగానే గుర్తించడం లేదు. ఆర్థికసాయం చేయడం లేదు. ‘ఇంట్లో పిల్లలకు తిండి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో బతుకీడుస్తున్నాం’ అని పలువురు చెప్పడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది.

ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకూ.. పెరుగుతున్న కౌలు రైతులు.. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల సంఖ్య 16 లక్షలంటున్నా, అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఉంటారని అంచనా. మొత్తం సాగుదారుల్లో సగభాగం వీరే. అధికశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందినవారే. అరెకరా, ఎకరా ఉన్న వారు కూడా నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గతంలో కోస్తా జిల్లాల్లో కౌలు రైతులు అధికంగా ఉండగా కొన్నేళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్నారు.

కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 100 మంది రైతుల కుటుంబాల్లో 90మంది కౌలు రైతులే. గోదావరి జిల్లాల్లో కౌలు రైతులే 10లక్షలకు పైగా ఉంటారని అంచనా. వానలతో పంటలు నష్టపోయేది వీరైతే.. పెట్టుబడి రాయితీ, బీమా యజమానులకు దక్కుతోంది. గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 166 కుటుంబాలను పరిశీలించగా 111 మంది కౌలు రైతులే. కృష్ణా జిల్లాలో 32 కుటుంబాలకుగాను అంతా కౌలుదారులే.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ 56 కుటుంబాలను పరిశీలించగా నలుగురే సొంత భూములున్నవారున్నారు. విశాఖపట్నం జిల్లాలో 11 కుటుంబాలను పరిశీలిస్తే ఏడుగురు కౌలు రైతులే. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 27 కుటుంబాలను పరిశీలించగా.. 21 మంది కౌలుదారులే. కర్నూలు జిల్లాలో 215 కుటుంబాలను పరిశీలిస్తే 43 మంది కౌలుకు తీసుకుని అప్పులపాలైనవారే. కౌలు రైతులుగా మారినవారు ఒకసారి వ్యవసాయంలోకి దిగితే మళ్లీ బయటకు రాలేని పరిస్థితి. రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తే ఎంతోకొంత అప్పు మిగులుతుంది.

వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి పంటను వారికే అమ్మడం తప్ప కౌలు రైతుకు మిగిలేదేమీ లేదు. ఖరీఫ్‌లో చేసిన అప్పును రబీలో చెల్లించడం, రబీలో తెచ్చిన అప్పును మళ్లీ ఖరీఫ్‌నాటికి జమ చేయడం.. ఆ వెంటనే మళ్లీ తెచ్చుకోవడం చేస్తున్నారు. కూలీలనుంచి కౌలు రైతులుగా మారినవారు అప్పులపాలై మళ్లీ కూలీలుగా మారుతున్నారు. వలసబాట పడుతున్నారు. అప్పులు భారీగా పెరిగిన కొందరు నిస్సహాయ స్థితిలో తనువు చాలిస్తున్నారు. దీంతో వారి కుటుంబీకులు మళ్లీ కూలీలవుతున్నారు.

డ్రైవర్‌ నుంచి కౌలు రైతుగా మారి.. అప్పులపాలై.. డ్రైవర్‌గా పనిచేసే అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం బందార్లపల్లికి చెందిన సోమశేఖర్‌.. ఆశతో సాగులోకి దిగారు. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. అధిక వర్షాలతో అది కాస్తా దెబ్బతింది. వచ్చిన కొద్దిపాటి దిగుబడికీ ధర దక్కలేదు. దీంతో నష్టాలే మిగిలాయి. తర్వాత ఏడాది మళ్లీ సాగు చేసినా వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతింది.

రెండేళ్లలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు కాస్తా రూ.7లక్షలకు చేరాయి. వడ్డీ భారం తడిసి మోపెడైంది. అప్పులిచ్చినవారు రోజూ ఇంటికి వస్తున్నారు. అవమానాలు భరించలేని సోమశేఖర్‌ 2021 అక్టోబరు 18న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో భార్య సాయిజ్యోతి, ఇద్దరు బిడ్డలు రోడ్డున పడ్డారు. కుటుంబాన్ని పోషించేందుకు సాయిజ్యోతి కూలీగా మారారు. తెచ్చిన అప్పులు ఎలా చెల్లించాలో తెలియడం లేదు.. ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందలేదు.

జీవనాధారం కరవై.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకటసుబ్బారావు (33) ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పైసా మిగలకపోగా రెండేళ్లలో రూ.5లక్షల అప్పు తేలింది. బంగారం తాకట్టు పెట్టి కొంత, ఇతరుల వద్ద మరికొంత తెచ్చారు.

వాటిని తీర్చే దారి కన్పించక ఈ ఏడాది ఫిబ్రవరి 24న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు కౌలుకార్డు లేదు. ఈ క్రాప్‌ కాలేదు. దీంతో పరిహారం అందలేదు. ఆయనకు భార్య విజయ, ఏడేళ్ల కుమారుడు, అయిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఇప్పుడు కుటుంబానికి ఆధారం కరవైంది.

మిరప రైతుకు నల్లతామర బెడద.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన షేక్‌ జానీబాషా(45) ఎకరా రూ.20వేల చొప్పున రెండెకరాలు కౌలుకు తీసుకుని మిరప వేశారు. నల్లతామరతో కాపు రాక రూ.2 లక్షల అప్పు మిగిలింది. ముందటి అప్పులతో కలిపితే రూ.5లక్షలైంది. వాటిని ఎలా చెల్లించాలో తెలియక 2021 నవంబరు 18న జానీబాషా ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో కౌలు రైతు కుటుంబసభ్యులు కాస్తా కూలీలుగా మారారు. అప్పులిచ్చినవారు చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వసాయం అందలేదని భార్య తైరూన్‌ పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే కుమారుడు జాహీద్‌ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

ఇవీ చూడండి:

Farmers: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో కౌలు రైతు వరికుంట ఏసుబాబు(35)కు వ్యవసాయంలో రూ.4లక్షల వరకు అప్పులై తీర్చే దారి కానరాక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కౌలుకార్డు లేదంటూ పరిహారం తిరస్కరించారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ఈ నెల 4న తమ ఇంటికి వచ్చిన జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు బాధిత కుటుంబీకులు తమ సమస్య వివరించగా.. ‘కౌలు రైతు అని చెబుతున్నా.. పంట సాగుపత్రం లేదంటున్నారు.

ప్రభుత్వ సాయం ఎలా మంజూరవుతుంది? ఏం చేయలేం’ అని స్పష్టం చేశారు. ఏసుబాబు కుటుంబమే కాదు.. రాష్ట్రంలో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో 90% మంది పరిస్థితి ఇదే. వాస్తవ సాగుదారులనే ఈ-క్రాప్‌లో నమోదు చేస్తున్నామని చెప్పే వ్యవసాయశాఖకు.. ఇలాంటివారంతా ఎందుకు కౌలు రైతులుగా కన్పించడం లేదో మరి?

కూలి పనులు చేస్తూనే ఏదో ఒక పంట వేస్తే కుటుంబ ఆదాయం పెరుగుతుందనే ఆశ వారిని కౌలు రైతులుగా మార్చింది. తమ కష్టం బిడ్డలకు రాకూడదనే ఆలోచన వారిది. అందుకే ఉన్న ఊళ్లోనే తెలిసిన రైతులనుంచో, తాము కూలి పనులు చేసే భూయజమానులనుంచో కొద్దిపాటి భూమిని కౌలుకు తీసుకుని వరి, పత్తి, మిరప ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కూలి ద్వారా సంపాదించిన సొమ్ముతోపాటు వ్యాపారులు, భూయజమానుల నుంచి అప్పు తీసుకుని పొలంపై పెడుతున్నారు.

వర్షాలు, వరదలు, తెగుళ్లతో దిగుబడులు రాక పంట దెబ్బతిని నష్టపోతున్నారు. అప్పుల ఊబిలోకి చేరుతున్నారు. సొంత భూములుంటే వాటిని అమ్మి అప్పు తీరుస్తామనే ధైర్యం ఉంటుంది. కౌలు రైతుల్లో చాలామంది సెంటు భూమి లేని వారే. దీంతో కొందరు కూలీలుగా మారుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చే దారి కన్పించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2019 జూన్‌ నుంచి 2022 మార్చి మధ్యలో ఆత్మహత్య చేసుకున్న 852 మంది రైతు కుటుంబాలను పరిశీలించగా 45%మంది కౌలు రైతులే. వీరిలో 90% మందిని గుర్తింపు కార్డులు లేవంటూ కౌలు రైతులుగానే గుర్తించడం లేదు. ఆర్థికసాయం చేయడం లేదు. ‘ఇంట్లో పిల్లలకు తిండి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో బతుకీడుస్తున్నాం’ అని పలువురు చెప్పడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది.

ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకూ.. పెరుగుతున్న కౌలు రైతులు.. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల సంఖ్య 16 లక్షలంటున్నా, అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఉంటారని అంచనా. మొత్తం సాగుదారుల్లో సగభాగం వీరే. అధికశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందినవారే. అరెకరా, ఎకరా ఉన్న వారు కూడా నాలుగైదు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గతంలో కోస్తా జిల్లాల్లో కౌలు రైతులు అధికంగా ఉండగా కొన్నేళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్నారు.

కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 100 మంది రైతుల కుటుంబాల్లో 90మంది కౌలు రైతులే. గోదావరి జిల్లాల్లో కౌలు రైతులే 10లక్షలకు పైగా ఉంటారని అంచనా. వానలతో పంటలు నష్టపోయేది వీరైతే.. పెట్టుబడి రాయితీ, బీమా యజమానులకు దక్కుతోంది. గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 166 కుటుంబాలను పరిశీలించగా 111 మంది కౌలు రైతులే. కృష్ణా జిల్లాలో 32 కుటుంబాలకుగాను అంతా కౌలుదారులే.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ 56 కుటుంబాలను పరిశీలించగా నలుగురే సొంత భూములున్నవారున్నారు. విశాఖపట్నం జిల్లాలో 11 కుటుంబాలను పరిశీలిస్తే ఏడుగురు కౌలు రైతులే. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 27 కుటుంబాలను పరిశీలించగా.. 21 మంది కౌలుదారులే. కర్నూలు జిల్లాలో 215 కుటుంబాలను పరిశీలిస్తే 43 మంది కౌలుకు తీసుకుని అప్పులపాలైనవారే. కౌలు రైతులుగా మారినవారు ఒకసారి వ్యవసాయంలోకి దిగితే మళ్లీ బయటకు రాలేని పరిస్థితి. రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తే ఎంతోకొంత అప్పు మిగులుతుంది.

వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి పంటను వారికే అమ్మడం తప్ప కౌలు రైతుకు మిగిలేదేమీ లేదు. ఖరీఫ్‌లో చేసిన అప్పును రబీలో చెల్లించడం, రబీలో తెచ్చిన అప్పును మళ్లీ ఖరీఫ్‌నాటికి జమ చేయడం.. ఆ వెంటనే మళ్లీ తెచ్చుకోవడం చేస్తున్నారు. కూలీలనుంచి కౌలు రైతులుగా మారినవారు అప్పులపాలై మళ్లీ కూలీలుగా మారుతున్నారు. వలసబాట పడుతున్నారు. అప్పులు భారీగా పెరిగిన కొందరు నిస్సహాయ స్థితిలో తనువు చాలిస్తున్నారు. దీంతో వారి కుటుంబీకులు మళ్లీ కూలీలవుతున్నారు.

డ్రైవర్‌ నుంచి కౌలు రైతుగా మారి.. అప్పులపాలై.. డ్రైవర్‌గా పనిచేసే అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం బందార్లపల్లికి చెందిన సోమశేఖర్‌.. ఆశతో సాగులోకి దిగారు. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. అధిక వర్షాలతో అది కాస్తా దెబ్బతింది. వచ్చిన కొద్దిపాటి దిగుబడికీ ధర దక్కలేదు. దీంతో నష్టాలే మిగిలాయి. తర్వాత ఏడాది మళ్లీ సాగు చేసినా వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతింది.

రెండేళ్లలో పెట్టుబడికి తెచ్చిన అప్పులు కాస్తా రూ.7లక్షలకు చేరాయి. వడ్డీ భారం తడిసి మోపెడైంది. అప్పులిచ్చినవారు రోజూ ఇంటికి వస్తున్నారు. అవమానాలు భరించలేని సోమశేఖర్‌ 2021 అక్టోబరు 18న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో భార్య సాయిజ్యోతి, ఇద్దరు బిడ్డలు రోడ్డున పడ్డారు. కుటుంబాన్ని పోషించేందుకు సాయిజ్యోతి కూలీగా మారారు. తెచ్చిన అప్పులు ఎలా చెల్లించాలో తెలియడం లేదు.. ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందలేదు.

జీవనాధారం కరవై.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకటసుబ్బారావు (33) ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పైసా మిగలకపోగా రెండేళ్లలో రూ.5లక్షల అప్పు తేలింది. బంగారం తాకట్టు పెట్టి కొంత, ఇతరుల వద్ద మరికొంత తెచ్చారు.

వాటిని తీర్చే దారి కన్పించక ఈ ఏడాది ఫిబ్రవరి 24న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు కౌలుకార్డు లేదు. ఈ క్రాప్‌ కాలేదు. దీంతో పరిహారం అందలేదు. ఆయనకు భార్య విజయ, ఏడేళ్ల కుమారుడు, అయిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఇప్పుడు కుటుంబానికి ఆధారం కరవైంది.

మిరప రైతుకు నల్లతామర బెడద.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన షేక్‌ జానీబాషా(45) ఎకరా రూ.20వేల చొప్పున రెండెకరాలు కౌలుకు తీసుకుని మిరప వేశారు. నల్లతామరతో కాపు రాక రూ.2 లక్షల అప్పు మిగిలింది. ముందటి అప్పులతో కలిపితే రూ.5లక్షలైంది. వాటిని ఎలా చెల్లించాలో తెలియక 2021 నవంబరు 18న జానీబాషా ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో కౌలు రైతు కుటుంబసభ్యులు కాస్తా కూలీలుగా మారారు. అప్పులిచ్చినవారు చెల్లించమంటూ ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వసాయం అందలేదని భార్య తైరూన్‌ పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే కుమారుడు జాహీద్‌ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.