బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వర్షం పాడుచేసిందని రైతులు ఆవేదన చెందారు. వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో మోస్తరు జల్లులు కురిశాయి.
నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేటలో కురిసిన వర్షాలకు ధాన్యం తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడుపేట పరిసరాల్లో వరి నూర్పిడి జోరుగా సాగుతోంది. అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాల్లో..
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలో కురిసిన అకాల వర్షంతో మినుము రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత పిందె దశలో ఉన్న మినుము పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువ అని రైతులు అంటున్నారు.
దివిసీమలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం చలి గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో మినుము పంట కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మోపిదేవిలో మినుము పంటను కాపాడుకోవడానిక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. మెట్ట ప్రాంతంలో టమాటా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు..!