చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై.... విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత వారం కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చింది. ఆ వివరాలను కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల బృందం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులకు వివరించింది. కరోనా పరీక్షలు జరిపే వైద్యులతో పాటు చికిత్స అందించేవారు... తప్పనిసరిగా కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. స్వీయ రక్షణ కోసం ప్రత్యేక గౌన్లు, కళ్లద్దాలు, ఎన్- 95 మాస్కులను ఎలా ధరించాలో సదస్సులో ప్రత్యక్షంగా వివరించారు. రోగుల నుంచి నమూనాలు ఎంత సమయంలో ఎలా సేకరించాలి, దశల వారీగా తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల గురించి.... పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా తెలిపారు. కరోనా భయంతో ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని.... ఇష్టారీతిన వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు
ఇటీవల శ్రీకాకుళం రిమ్స్లో కరోనా వైరస్ అనుమానిత రోగుల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపడంలో.... అక్కడి వైద్యులు అనుసరించిన తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మండిపడింది. అక్కడి సీనియర్ వైద్యులు ధనుంజయరావును విజయవాడలోని సెంట్రల్ కరోనా కంట్రోల్ కార్యాలయంలో విధులు నిర్వహించాలని ఆదేశించింది. నమూనాలను ఎక్కడికక్కడ పరీక్షించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్న వైద్యులు.... తిరుపతి స్విమ్స్, విజయవాడ ప్రభుత్వ వైరాలజీ ల్యాబ్లోనూ పరీక్షించేందుకు అనుమతినిచ్చిందని చెప్పారు. పరీక్షల్లో పాజిటివ్ అని వస్తే పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు. అక్కడ నిర్ధరణ అయితేనే అధికారికంగా ప్రకటిస్తారు.