ఆందోళనకర స్థితిలోనూ సమయస్ఫూర్తి ప్రదర్శించి సహోద్యోగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ తీరు.. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కానిస్టేబుల్ కిషోర్.. పాము కాటుకు గురైన సహోద్యోగిని ఆపద నుంచి కాపాడి మన్ననలు పొందుతున్నారు. ముసునూరు పీఎస్లో శివ కిరణ్, కిషోర్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆ ఇద్దరు.. అర్థరాత్రి రంగంపేట గ్రామం వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పొదలొంచి వచ్చిన పామును చూసి భయపడ్డారు.
బైకు అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. శివ కిరణ్ కాలుపై పాము కాటు వేసింది. ఈ పరిణామానికి షాక్ తిన్న కిషోర్.. క్షణాల్లో తేరుకొని ద్విచక్రవాహనంపై కిరణ్ను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు.. సకాలంలో తీసుకురావడంతో ప్రాణాపాయస్థితి తప్పిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో సమయస్ఫూర్తి ప్రదర్శించి తోటి ఉద్యోగి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ కిషోర్ను వైద్య నిపుణులు డాక్టర్ డేవిడ్ అభినందించారు.
విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. కానిస్టేబుల్ కిషోర్ను అభినందించారు. కిషోర్ సమయస్ఫూర్తికి నూజివీడు డీఎస్సీ బి శ్రీనివాసులు ఘనంగా సత్కరించి నగదు రివార్డు అందజేశారు. కిషోర్ కాపాడింది కేవలం తనతోటి ఉద్యోగిని మాత్రమే కాదని.. బాధితుడు శివ కిరణ్ను నమ్ముకున్న మొత్తం కుటుంబాన్ని అన్నారు.
ఇదీ చదవండి:
Suspicious Death: విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్పద మృతి