మిలియన్ డాలర్ల పంట రొయ్యల సాగులో పెను ఉపద్రవం ముంచుకొస్తోంది. తెల్లమచ్చల కంటే భయంకరమైన ఈ వ్యాధి ప్రస్తుతం రాష్ట్ర ఆక్వారంగాన్ని వణికిస్తోంది. ఎంటిరోసైటోజూన్ హెపాటోపెనాయి (ఈహెచ్పీ) మాట కొత్తగా ఉన్నా దాని ప్రభావం మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇది ఒకసారి చెరువుల్లో ప్రవేశిస్తే అందులోని రొయ్యల్లో పెరుగుదల నిలిచిపోతుంది. రోజులు పెరిగే కొద్దీ క్రమంగా మరణిస్తుంటాయి. మందులు దీనిపై ప్రభావాన్ని చూపలేవు. దీతో పోల్చితే తెల్లమచ్చల వ్యాధే నయమని రైతులు పేర్కొంటున్నారు. తెల్లమచ్చల వ్యాధి వస్తే వెంటనే పట్టుబడి చేయడమో, లేదా పెట్టుబడి ఆపేయడమో చేస్తుంటారు. ఈహెచ్పీ వ్యాధి సోకితే చెరువులో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆశగా పెట్టుబడి పెడితే తీరా మిగిలేది నష్టం మాత్రమే. కృష్ణాజిల్లాలో ప్రస్తుతానికి 65 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా.. తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో రెండు లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఈ వ్యాధి సోకిన తరవాత నివారణ చర్యలు పాటించకుంటే మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం ఉంది.
హేచరీల నుంచే..
ఈహెచ్పీ రొయ్య రొమ్మును పీడిస్తూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవి మరణించేలా చేస్తుంది. హేచరీల్లో బ్రూడ్స్టాక్ దశ నుంచే ఇది ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. రొయ్య పిల్లను పరీక్ష చేయించుకోకపోవడంతో ఈహెచ్పీ బారిన పడుతున్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను విడనాడడం వల్ల, ఒకే నీటిలో రెండుసార్లు కంటే ఎక్కువగా సాగుచేయడం ద్వారా ఇది సోకే అవకాశం ఉంటుంది.
నివారణ చర్యలు..
* చెరువుల్లో సాగు ఉన్నప్పుడు బయట పడితే చేసేదేమీ లేదు. సాగు పూర్తయిన తర్వాత దాన్ని సమూలంగా నివారించాలంటే అధికస్థాయిలో సున్నాన్ని నేలపై జల్లి భూమి పీహెచ్ స్థాయిని 12 శాతం కంటే ఎక్కువకు తీసుకువెళ్లాలి. అప్పుడే ఈ వ్యాధి నివారణ అవుతుంది.
* సాగు చేసిన చెరువును ఎండబెట్టినా ఈ వ్యాధి భూమిలో ఉండిపోతుంది. రొయ్యపిల్ల వేసిన 15 రోజుల తర్వాత నేలల్లో ఉన్న పురుగులు, వానపాములను తవ్వి ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ వ్యాధి రొయ్యలోకి వస్తుంది. అందుకే చెరువు నేలను తప్పక శుభ్రం చేసుకోవాలి.
* ఈ వ్యాధి సోకిన చెరువుల్లో పిల్లను రక్షించుకోవడానికి ఎటువంటి రసాయనాలు లేవు. చెరువుల్లో రొయ్యలకు సరిపడే మేతను అందించాలి. మేతల్లో గ్రోత్ ప్రమోటర్ పెట్టుకుంటే కొంత వరకు నష్టాన్ని నివారించుకోవచ్ఛు
* ఒక ప్రాంతంలోని అన్ని చెరువులకు ఈ వ్యాధి సోకితే వాటి నీటి వనరులైన కాలువలు, గుంతలను కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది.
* పిల్లస్థాయిలోనే నివారించేందుకు హేచరీల్లో కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా పీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి.
మండవల్లికి చెందిన ఓ రైతు ఆరు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఎకరాకు 1.5 లక్షల చొప్పున తొమ్మిది లక్షల రొయ్య పిల్లలను ఒంగోలులో ఓ పేరు మోసిన ప్రభుత్వ గుర్తింపు ఉన్న హేచరీ నుంచి తెచ్చి చెరువులో వేసి పెంచసాగారు. రెండు నెలలు గడుస్తున్నా ఎదుగుదల లేకపోవడంతో టెక్నీషియన్కు చూపించారు. రొయ్యపిల్ల, నీరు, మట్టిని పరీక్షించి.. చెరువులో ఈహెచ్పీ వ్యాధి ఉందని, వెంటనే పట్టు బడి చేయాల్సిందిగా సూచించారు. మరో రెండు వారాలు చెరువులోనే ఉంచి పట్టుబడి చేశారు. 80 రోజులకు సుమారు 50 నుంచి 70 కౌంట్ మధ్యలో ఉండాల్సిన రొయ్యలు 180 కౌంట్లో ఉన్నాయి. ఆరెకరాలు పట్టుబడి చేస్తే కేవలం 1.5 టన్నుల సరకు మాత్రమే మిగిలింది. రూ.20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1.50 లక్షలు మాత్రమే వచ్చాయి.
అవగాహన కల్పిస్తున్నాం
ఈహెచ్పీ, ఏహెచ్పీఎన్డీ వ్యాధులు ఐదేళ్లగా కనిపిస్తున్నా.. ప్రస్తుతం వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. హేచరీల వద్ద పిల్లను తీసుకున్నప్పుడు తప్పనిసరిగా పీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి. చెరువుల్లో సాగు అయిపోయిన తర్వాత పీహెచ్ (ఆమ్లస్థాయి)ని పెంచడంతోనే దీన్ని నివారించగలం. సాగుకు, సాగుకు మధ్యలో చెరువును ఎండబెట్టడం, దున్నడం, సూక్ష్మపోషకాలను అందిచడం వంటి శాస్త్రీయ పద్ధతులు తప్పక అనుసరించాలి. అవగాహనతోనే ముందడుగు వేస్తే నష్టాలను నివారించుకునే వీలుంటుంది. - వర్థన్, మత్స్యశాఖ ఏడీఏ కైకలూరు