రాష్ట్రంలో ఇసుక సమస్యపై... విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి విపక్షాలు సహా... ప్రజాసంఘాలు హాజరయ్యాయి. జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రజాసంఘాలు, భవన నిర్మాణదారులు, కార్మిక సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. 7 అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ 5 నెలల్లో ఉపాధి కోల్పోయి... ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన కార్మికులకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు.
నిర్మాణరంగాన్ని దెబ్బతీసిన నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం సహా... అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను సీజ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అక్రమ రవాణాను అరికట్టి, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేలా... ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇసుక ధరలు అమాంతం పెరగటం కారణంగా పనుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
గతంలో 7 నుంచి 8 వేలు పలికిన ఇసుక లారీ ధర... ప్రస్తుతం రూ.50 వేలకు చేరిందని సీపీఐ నేతలు ఆరోపించారు. సిమెంటు కంపెనీలతో బేరాలు కుదరక... ఇసుక నిలిపివేశారని ధ్వజమెత్తారు. 36 మంది కార్మికుల ఆత్మహత్యలను... ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. మద్యం పాలసీని ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అమలు చేసిన ప్రభుత్వం... ఇసుక విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిలదీశారు. ఐక్య కార్యాచరణతో అన్ని సమస్యలపైనా ఉద్యమించాలని పార్టీలు, కార్మిక సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు.