కేంద్ర రైల్వే శాఖ ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించగా.. అండర్బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతులు నగర పాలక సంస్థ కల్పించింది. ఫలితంగా మరో నాలుగు రోజుల్లో వంతెన పనులు ప్రారంభం కానున్నాయి. నాలుగు నెలల పాటు రాయలచెవురు గేటు నుంచి రాకపోకలను మళ్లిస్తూ నగరపోలీసులు చర్యలు చేప్టటారు.
తిరుపతి నగరంలోని 104 నెంబర్ లెవల్ క్రాసింగ్ తిరుపతి-రాయలచెరువు రైల్వే గేటు సమస్య పరిష్కారం కానుంది. కరోనాకు ముందు సాధారణంగా రైళ్లు తిరిగే సమయంలో తరచూ రైలు గేటు పడుతూ ట్రాఫిక్ సమస్యలతో తిరునగర వాసులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు తొలగిపోనున్నాయి. రోజుకు 70 నుంచి 80 పాసింజర్, ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులు నడుస్తూ.. తరచూ గేటు పడుతుండటంతో నగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. రోజుకు కనీసం 70 సార్లు పడే.. ఈ రైల్వే గేటుతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు ఇక్కడ తొలగిపోనున్నాయి.
తిరుపతిలో మారుతీ నగర్, ఎమ్మార్ పల్లి, బైరాగిపట్టెడ, అన్నమయ్య సర్కిల్ ప్రాంతాలకు వెల్లే ప్రజలు తరచూ గేటు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గేటుకు సమీపంలోనే ఉన్న రైతు బజారులో కాయగూరలు కొనుగోలు చేయడానికి వచ్చే వారు కూడా రైలు గేటుతో అసౌకర్యానికి గురయ్యేవారు. ఈ సమస్యలను దృష్టిలో రెండున్నర సంవత్సరాల క్రితం అండర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రెండున్నర మీటర్ల ఎత్తు, పన్నెండు మీటర్ల వెడల్పుతో చిన్నపాటి అండర్ పాస్ నిర్మాణాలు చేయనున్నారు.
భూగర్భంలో ఉన్న తెలుగు గంగ మంచి నీరు, భూగర్భ మురుగు నీటి పైపు లైన్లను, కేబుళ్ల మార్పును నగరపాలక సంస్థ రెండు కోట్ల రూపాయల నిధులతో నగరపాలక సంస్థ దాదాపుగా పూర్తి చేసింది. దీంతో అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. నాలుగు నెలల పాటు రాయలచెరువు రైల్వేగేటు నుంచి రాకపోకలు పక్కకు మళ్లించాలని కోరుతూ రైల్వేశాఖ తిరుపతి నగర ట్రాఫిక్ పోలీసులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు