రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి ఇవాళ తిరుపతిలో నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.45 గంటలకు బయలుదేరి మధ్నాహ్నం 2.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలోని ఫులే విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆ విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొని, సాయంత్రం 5 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
చంద్రబాబు ర్యాలీకి అనుమతి రద్దు
తిరుపతిలో చంద్రబాబు తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పండుగ సీజన్ కావడంతో ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ వెల్లడించారు.
తెదేపా నేతల గృహ నిర్బంధం
చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ను గృహ నిర్బంధం చేశారు.