All party leaders on Steel Industry At kadapa : కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉక్కు పరిశ్రమకోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను అఖిలపక్షం నాయకులు గురువారం సందర్శించారు. ముందుగా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన పైలాన్, తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రహ్మణి కోసం వేసిన శిలాఫలకం, అనంతరం సీఎం జగన్ కన్యతీర్థం వద్ద ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. అక్కడ కాసేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రస్తుత ఉక్కు విలువ ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలోనే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే లాభంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో కర్మాగారానికి సంబంధించి అన్ని వసతులూ ఉన్నా.. పనులు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా పరిశ్రమ నెలకొల్పేందుకు అడుగులు ముందుకు పడడం లేదన్నారు. 2023 డిసెంబరు 23 లోగా పనులు మొదలు పెట్టుకుంటే వైకాపా పతనం ఖాయమని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ..కేంద్రంపై అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి, కడప పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు లింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తాం : బీజేపీ