తెలంగాణ మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ భూముల వ్యవహారం(Etela rajender land issues) మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు(Notices on Etela rajender land issues) జారీ చేశారు. సర్వే నంబర్ 97లో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18న సర్వేకు హాజరు కావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్రెడ్డికి తూప్రాన్ ఆర్డీవో నోటీసులు పంపించారు.
![Etela rajender land issues](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13573803_notice.jpeg)
ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సమగ్ర సర్వే కోసం నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో భూముల ప్రాథమిక సర్వే చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గేవరకు సర్వే తాత్కాలిక నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించిందని... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు ఇప్పుడు ఇచ్చారని ఆయన వివరించారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో సర్వే ఉంటుందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.