గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు తగిన పోలీసు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను, ఎస్ఈసీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
గురజాల, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేలా, పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.వరలక్ష్మి, బి.కృపారావు మరికొందురు హైకోర్టులో అత్యవసరంగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. అధికారపార్టీ నేతలు పిటిషనర్లను నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించాలన్నారు.
ఎన్నికల నిర్వహణ తీరును టెలికాస్ట్ చేయాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. సంబంధిత పోలీసులు, ఎస్ఈసీ కార్యదర్శికి ఈనెల 12 లోపు వినతి ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ వినతిని పరిగణనలోకి తీసుకొని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిలకు జరిగేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసులు, ఎస్ఈసీని ఆదేశించారు.
ఇదీ చదవండి