తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జూరాలకు జులై 14న వరద మొదలైంది. 23 తేదీ నాటికి తొమ్మిది రోజుల వ్యవధిలో 58.45 టీఎంసీల వరద నమోదైంది. జలాశయంలో సుమారు 3.5 టీఎంసీలు నిల్వ చేశారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం 4.5 టీఎంసీలను తరలించారు. మిగతా 50.45 టీఎంసీల వరద నీటిని దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వదిలారు. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 115.96 టీఎంసీల వరదనీరు చేరగా.. ప్రాజెక్టులో నీటి నిల్వ అనంతరం ఇప్పటివరకు 56 టీఎంసీలను దిగువకు వదిలారు. వచ్చిన వరద నీటిలో నారాయణపూర్ జలాశయంలో నీటినిల్వ అనంతరం గరిష్ఠ సామర్థ్యానికి చేరిన తర్వాత 46 టీఎంసీలను జూరాలకు వదిలారు.
కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వచ్చిన 46 టీఎంసీలకు తోడు పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో జూరాలలోకి 12.45 టీఎంసీల వరద నీరు చేరింది. గురువారం రాత్రి 7 గంటలకు జలాశయంలోకి 65 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 6 గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కులు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్తు కేంద్రాల్లో 429 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటితో పాటు సుంకేసుల నుంచి 8,824, హంద్రీ నుంచి 2,876 క్యూసెక్కులు కలిపి శ్రీశైలం జలాశయానికి 78,150 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 849.2 అడుగులు, నీటినిల్వ 78.39 టీఎంసీలుగా నమోదయ్యింది. గోదావరికి ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహంతో కాళేశ్వరం వద్ద 6.94 మీటర్ల నీటిమట్టం నమోదవుతోంది.
ఇదీ చూడండి: తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు