శిథిలావస్థ గృహాల్లో బిక్కుబిక్కుమంటు కాలం వెల్లదీస్తున్న ముంపు బాధితుల అవస్థలు అంతా ఇంతా కాదు. ఎప్పుడు ఏది విరిగి మీద పడుతుందో తెలియక నిత్యం భయంతో బతుకుతున్నారు. నేడో.. రేపో ఖాళీ చేయాల్సిందేనన్న ఆలోచనతో.. ఇంటికి మరమ్మతులు చేయించడానికి వెనకాడుతున్నారు. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వెంకటాద్రి జలాశయం ముంపులోని బండరావిపాకుల సర్పంచి లక్ష్మమ్మతోపాటు ఆమె మనవడిపై ఇటీవల మట్టి మిద్దె కూలి ప్రాణాలు హరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంపు బాధితుల అవస్థలు, పునరావాస చర్యలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం.
డిండి ఎత్తిపోతల కింద ఇలా...
డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 9927 ఎకరాల్లో 7133 ఎకరాలు సేకరించారు. జలాశయాల కింద ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 769 గృహాలకు చెందిన 1120 కుటుంబాల వారు నిరాశ్రయులవుతున్నారు. కిష్టరాయనపల్లి జలాశయం కింద ముంపులో పోతున్న నాంపల్లి మండలం ఎస్డబ్ల్యూ లింగోటం పంచాయతీ లక్ష్మణాపురం గ్రామంలో పునరావాస చర్యలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 124 ఇళ్లు, 175 కుటుంబాలు ముంపు కింద ఉన్నాయి. పరిహారంపై స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం జాప్యమవుతోంది. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పై కప్పు కురుస్తున్నా...
మా తాతముత్తాల నుంచీ ఇదే గ్రామంలో జీవిస్తున్నాం. ఉన్న పది ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. నా ఇద్దరు కొడుకులు ఉపాధి లేక లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ప్రాజెక్టు కింద ఊరు పోతుందని తెలిసినప్పటి నుంచి ఇంటికి సున్నం కూడా వేయడం లేదు. పైకప్పు కురుస్తున్నా ఉపయోగం లేదని మరమ్మతులు చేయించలేదు.
- బాణావత్ పాండు, లక్ష్మణాపురం, నాంపల్లి మండలం
ఇదీ మల్లన్నసాగర్ పరిస్థితి..
సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. దీని నుంచి కొండపోచమ్మ సాగర్, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, నిజాంసాగర్, సింగూరు జలాశయాలకు కూడా నీటిని అందించనున్నారు. ఈ జలాశయం నిర్మాణంలో ఎనిమిది పంచాయతీల్లోని 16 గ్రామాలు పూర్తి స్థాయిలో ముంపులో పోతుండగా తొగుట, తుక్కాపూర్ గ్రామాల కింద సాగు భూమి 90 శాతానికిపైగా ముంపు కింద ఉంది. మొత్తం 17 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ముంపు గ్రామాల్లోని 5618 కుటుంబాలకు గాను ఇంకా 251 కుటుంబాలు కోర్టు కేసులు, ఇతర కారణాలతో పరిహారం అందక గ్రామాల్లోనే ఉన్నాయి. 65 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళలు, పురుషులకు పునరావాసం ప్యాకేజీలో ఇప్పటివరకు కేటాయింపులు లేవు.
ఎవరికీ పరిహారం దక్కలేదు
ఈమె పేరు బండ్ల లింగవ్వ. తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామం. శిథిలమైన ఇంట్లోనే జీవిస్తున్న ఆమె మనోవేదన అంతా ఇంతా కాదు. ‘నాకు భర్త లేరు. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు నర్సింహులు పునరావాస డబ్బుల కోసం తిరిగి తిరిగి దిగులుతో ప్రాణాలు విడిచాడు. ఇద్దరు కొడుకుల కుటుంబాలకు కూడా పరిహారమివ్వలేదు. వారు ఉపాధికి ఇతర గ్రామాలకు వెళ్లారనే కారణం చూపి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఊరిలోనే ఉంటున్నా, నాకు పరిహారం వర్తింపజేయలేదు. కూలిపోతున్న ఇంటిని బాగు చేసుకునేందుకు ఆదాయం ఏదీ లేదు’ అంటూ లింగవ్వ వాపోయింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ఇలా
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 2015 జూన్ 11వ తేదీన శంకుస్థాపన రాయి పడింది. మొదటి విడతగా అయిదు జలాశయాలను నిర్మిస్తున్నారు. వాటి పరిధిలో ఆరు గ్రామాలు, 17 తండాలు ముంపులో ఉన్నాయి. ఇప్పటి వరకు కురుమూర్తిరాయ జలాశయం పరిధిలో మాత్రమే పునరావాస చర్యలు చేపట్టారు. మిగిలిన చోట్ల స్థల సేకరణ, అభివృద్ధి, నిర్మాణాల దశల్లో ఉన్నాయి.
ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాం
ఇంటి కప్పు నుంచి గోడలోకి దిగిన పగుళ్లు చూపిస్తున్న ఈ వృద్ధుని పేరు ముడావత్ తుకారాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లోని వెంకటాద్రి (వట్టెం) జలాశయం ముంపు గ్రామమైన బిజినేపల్లి మండలం అనేఖాన్పల్లి తండా ఈయనది. తాతల కాలం నుంచీ సాగును నమ్ముకుని వారి కుటుంబం ఇక్కడ జీవిస్తోంది. ఆనకట్ట నిర్మాణం వీరి ఇంటి సమీపానికి చేరుకుంది. ‘మాకు పరిహారంలో భాగంగా ఇవ్వాల్సిన 250 గజాల ఇంటి స్థలం అందలేదు. ఊరిని విడిచిపెట్టాలంటే బాధగా ఉంది. అయినప్పటికీ ఇళ్లు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎలాగో వెళ్లిపోతాం కదా అని ఇంటికి మరమ్మతు చేయడం లేదు. వర్షాలకు ఎక్కడ గోడలు కూలుతాయో అని భయంగా ఉంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.