ap rain alert: పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
కృష్ణవేణి... నురగల పూబోణి
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 4,28,078 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయ నీటిమట్టం 884.40 అడుగులు, నీటినిల్వ 211.9572 టీఎంసీలుగా నమోదైంది. దాంతో శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర పైకెత్తారు. స్పిల్వే ద్వారా 3,76,670 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 62,091 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ మేరకు నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి 4,24,428 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో అంతే మొత్తంలో కిందికి వదిలేస్తున్నారు. మరోవైపు పులిచింతల నుంచి గురువారం రాత్రి ఔట్ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులు వదిలారు. దిగువన విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 2.73 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు.
తెలంగాణలో..
Telangana Weather Updates : రాష్ట్రంలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ గురువారం పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
Telangana Rains News : హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
మహానగరంలో వాగులైన రహదారులు.. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వాగులను తలపించాయి. కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 6.8 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబిలో 6.4, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఇవీ చదవండి :