గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి అంచనా విలువలో 25% కంటే తక్కువ ఖర్చుచేసిన గ్రామీణ రహదారులు, వంతెనలు, భవనాల పనులు రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో నిర్ణయం తీసుకుంది. మళ్లీ వాటిని పూర్తి చేయించడంపై దృష్టి సారించడం లేదు. అసంపూర్తిగా ఆగిపోయిన కారణంగా ఆయా మార్గాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ టెండర్ల రద్దుకు కారణమేదైనప్పటికీ అప్పటివరకు గుత్తేదారులు చేసిన ఖర్చులకు బిల్లులు చెల్లించి, మిగిలిన పనులకు మరోసారి టెండర్లు పిలిస్తే ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇలా అర్ధంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు వేలల్లో ఉన్నాయి.
అసంపూర్తి మిగిలిపోయినవి పూర్తి చేయించేందుకు ఇంజినీర్లు మరోసారి అంచనాలు తయారు చేసి ఉన్నతాధికారుల ఆమోదానికి పంపినా.. పై స్థాయిలో అతీగతీ లేదు. 2019 ఏప్రిల్1కి ముందు మంజూరు చేసిన వివిధ ఇంజినీరింగ్ పనుల్లో అంచనా విలువలో 25% కంటే తక్కువ ఖర్చు చేసిన వాటిని వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది. ఇలా అప్పట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో వివిధ పద్దుల కింద రూ.3,118.38 కోట్లతో ప్రారంభించిన 7,282 పనులు 2020 జూన్లో నిలిచిపోయాయి. వీటిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, భవనాలు ఉన్నాయి. అప్పటికే దాదాపు రూ.648.83 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగతావి మరో ఏడాదిన్నరలో పూర్తయ్యే దశలో నిలిపివేశారు. రద్దు చేసిన వాటిపై ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదు.
ఈ పనులు ముగించేందుకు రూ.181.83 కోట్లు అవసరమని అప్పట్లో పీఆర్ ఇంజినీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో మిగిలిన ప్రాజెక్టులకు రెండోసారి టెండర్లు పిలిచే వీలుంటుందని ఇంజినీర్లు భావించారు. నిధులు కేటాయించని కారణంగా ఇప్పటికీ చాలా జిల్లాల్లో పనులు క్లోజ్ చేయలేదు. వీటిపై అప్పటికే ఖర్చుచేసిన గుత్తేదారులు పనులు క్లోజ్ చేసి తమకు రావాల్సిన తుది (ఫైనల్) బిల్లులు ఇప్పించాలని ఇంజినీర్ల చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకుండాపోయింది. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు ఇంజినీర్లు అంచనాలు వేసి ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
![](https://assets.eenadu.net/article_img/130622ap-main2a.jpg)
- ప్రకాశం జిల్లాలో దొనకొండ, త్రిపురాంతకం, కురిచేడు మండలాలను అనుసంధానించే వంతెనతోపాటు మరో 4 కిమీ రోడ్డు పనులు రూ.7 కోట్లతో 2016లో మొదలయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయి రోడ్డు వేయడం ప్రారంభించిన కొద్దిరోజులకే రద్దు చేశారు. దీంతో వంతెనకు ఇటూ అటూ రోడ్డు సరిగాలేక మూడు మండలాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ గుత్తేదారుకు రూ.50లక్షలకుపైగా బిల్లు చెల్లించలేదు.
![](https://assets.eenadu.net/article_img/130622ap-main2b.jpg)
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో నుసికొట్టాల నుంచి ఆత్మకూరుకు ఐదు కిమీ రోడ్డు పనులు రూ.1.45 కోట్లతో ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. రూ.2.45 లక్షలకు పైగా ఖర్చు చేశాక రద్దు చేశారు. మిగిలిన పనులు తిరిగి చేపట్టకపోవడంతో దారంతా కంకర తేలి అధ్వానంగా తయారైంది.
![](https://assets.eenadu.net/article_img/130622ap-main2c.jpg)
- శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని వెంకటాపురం కూడలి నుంచి లుకలాపుపేట, గోవిందపురం, ఇజ్జాడపాలెం, కొత్తకోట, ఆదపాక తదితర 20 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. 7.78 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణ పనులను 2019లో రూ.1.20 కోట్లతో ప్రారంభించారు. అర్ధంతరంగా ఈ టెండర్ రద్దు చేయడంతో నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ రాళ్లు తేలి గుంతలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు.
![](https://assets.eenadu.net/article_img/130622ap-main2d.jpg)
ఇదీ చదవండి:
ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్