మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శతజయంతిని.. ఈనెల 28న ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్లో పీవీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అందుకోసం హుస్సేన్ సాగర్ తీరాన అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్సవాల కమిటీ ఛైర్మన్ కేశవరావు.. అధికారులను ఆదేశించారు. పీవీ నరసింహారావు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
సీఎస్ సమీక్ష
పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీస్ అధికారులతో సమావేశమైన సీఎస్... ఏర్పాట్లపై చర్చించారు. వేడుకలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని కేకే తెలిపారు. శతజయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించే విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు.
నగరం నడిబొడ్డున పీవీ ప్రతిమ
తెలుగు జాతి ఖ్యాతిని దేశ నలుమూలలా చాటి చెప్పిన పీవీ కాంస్య విగ్రహ ప్రతిమ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెక్లెస్రోడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. 16 అడుగుల ఎత్తు 2 టన్నుల బరువుతో పసిడి వర్ణంతో మెరుగులు అద్దుకుంటోంది. తొలిసారిగా లేజర్ సాంకేతికతో, అమెరికా నుంచి తెప్పించిన యంత్రాలతో పీవీ విగ్రహం నమూనా తయారైంది. ఈ విగ్రహం నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ. 27 లక్షలు ఖర్చు చేసింది.
కేవలం 17 రోజుల్లో...
కేవలం 17 రోజుల్లో 15 మంది కళాకారులు అహర్నిశలు కృషి చేసి విగ్రహాన్ని పూర్తి చేశారు. నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన భూమి ఉండటంతో ఆ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్గా ఇప్పటికే ప్రభుత్వం మార్చింది. రహదారి ప్రారంభంలో హుస్సేన్సాగర్ తీరాన పీవీ విగ్రహ ఏర్పాటుకు ఆధునీకరణ పనులు చేస్తున్నారు.
ఆకర్షణీయంగా..
పీవీ విగ్రహం ముందు భాగంలో విగ్రహం వద్దకు వెళ్లేలా మెట్లు, పీవీ మార్గ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ను కలుపుతూ విగ్రహం వెనుక నుంచి నడిచి వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ మొత్తం అందమైన గ్రిల్స్ ఏర్పాటు చేసి.. వాటిలో రకరకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలతో సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా లేజర్ సాంకేతికతో పీవీ కాంస్య విగ్రహం రూపుదిద్దుకోవడంతో నెక్లెస్ రోడ్డు కూడలికి, నగరానికి అదనపు హంగులు అద్దుకున్నాయి.
ఇదీ చదవండి: