కరోనా లక్షణాలు లేకపోయినా కొందరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసుల్లో దాదాపు నుంచి 15 నుంచి 20 శాతం మందికి లక్షణాలు లేనట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 439 కేసులు నమోదయ్యాయి.
పరీక్షలు ఎవరికి చేయాలంటే...
విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల నుంచి రావడం, ఆయా ప్రాంతాల నేపథ్యం, రోగ లక్షణాలను బట్టి నిర్ధారణ పరీక్షలు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీని ప్రకారం వైద్యులు, అధికారులు వైరస్ అనుమానిత లక్షణాలుంటేనే పరీక్షలు చేశారు.
డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 95 శాతం కేసుల్లో సగటున 5.2 రోజుల్లోనే లక్షణాలు బయటపడుతున్నాయి. మిగిలినవి 14 రోజుల్లో తెలుస్తున్నాయి. అరుదుగా కొందరిలో 21 రోజులకూ బయటపడే అవకాశాలున్నాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దిల్లీకి వెళ్లి వచ్చినవారికి నిర్వహించిన పరీక్షల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఈ లక్షణాలు లేకపోతే సాధారణంగానే గడుపుతుంటారు. ఇలాంటి వారి నుంచే సమాజంలో కరోనా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
* నెల్లూరు జిల్లాలో ఇద్దరు దిల్లీ వెళ్లి గతనెల 20న వచ్చారు. వీరిలో అనుమానిత లక్షణాలు కనిపించలేదు. గత నెలాఖరులో వారికి పరీక్షలు చేయించగా పాజిటివ్ అని వచ్చింది.
* విశాఖలో ఇటీవలే ఓ కేసు నమోదైంది. దిల్లీ నుంచి వచ్చినవారితో సన్నిహితంగా ఉన్నందున ఓ వ్యక్తికి వైరస్ సోకింది. మొదట్లో ఇతన్ని స్వీయ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. తర్వాత నమూనాలు పరీక్షించగా పాజిటివ్ వచ్చింది.
* అమెరికా నుంచి వచ్చిన మూడువారాల తర్వాత ఓ మహిళకు లక్షణాలు లేకపోయినా కుటుంబసభ్యులను కలుసుకునే ముందు పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
* తూర్పుగోదావరి జిల్లాలో 41 ఏళ్ల వ్యక్తికి ప్రయాణ నేపథ్యం లేదు, పాజిటివ్ వచ్చినవారినీ కలవలేదు. కానీ ఆయనకు వ్యాధి సోకింది.
వీరికి మినహాయింపు
దిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చినవారి విషయంలో మార్గదర్శకాల అమల్లో మినహాయింపు ఇచ్చారు. దిల్లీ నుంచి వచ్చినవారు, వీరితో సన్నిహితంగా ఉన్నవారి నమూనాలు తీసుకుని వైద్య ఆరోగ్యశాఖ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించింది. నమూనాలు సేకరించేటప్పుడు చాలామందికి అనుమానిత లక్షణాలు అసలు లేవు. అయినా వారిలో కొందరికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ తరహా కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన చోట 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ర్యాండమ్ పరీక్షలు చేస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: