దిల్లీలో పర్యటిస్తోన్న రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... కేంద్రమంత్రి హర్షవర్ధన్తో దిల్లీలో భేటీ అయ్యారు. కరోనాపై పోరులో రాష్ట్రానికి కేంద్ర సాయం, వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో వైద్యకళాశాల ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.
కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మాట్లాడిన బుగ్గన.. .కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీ ముందుందని చెప్పారు. తక్కువ మరణాల రేటు, ఎక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీ అన్నారు. కరోనా ఆస్పత్రుల్లో అన్నిరకాల వసతులు పెంచామని ఆయన పేర్కొన్నారు. కరోనా ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలు, తాత్కాలిక సిబ్బందిని నియమించామని స్పష్టం చేశారు. కొవిడ్ అత్యవసర నిధి నుంచి రాష్ట్రానికి కొంత సాయం కోరామన్నారు.
ఏపీలో కొవిడ్ నియంత్రణకు రూ.981 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని బుగ్గన తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి 3 వైద్యకళాశాలలు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఏపీలో పెద్ద జిల్లాలు ఉన్నాయని కేంద్రమంత్రికి తెలిపామన్నారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్లో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైద్యకళాశాలల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పీపీఏ ప్రతిపాదనలు కేంద్ర జలశక్తిశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయన్న బుగ్గన...త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : ‘పోలవరం’పై దిల్లీకి బుగ్గన