Harassment on Social Media : సాంకేతిక పరిజ్ఞానం విస్తృతితో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్చాట్ తదితర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించే వారూ అదే స్థాయిలో పెరిగారు. యువతరం నిరంతరం వీటికి అనుసంధానమై ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు మోసగాళ్లు నకిలీ ఐడీలతో యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. వారి వ్యక్తిగత చిత్రాలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.
బరితెగించి దారుణాలు
- విజయవాడ శివారులో ఓ వైద్య కళాశాలలో మెడిసిన్ విద్యార్థికి నిన్ను ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి రీల్స్ పోస్టు చేస్తూ వేధిస్తున్నాడు. అంతటితో ఆగక ఆమెకు తెలిసిన వారికి కూడా వాటిని పంపుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలను సేకరించి రీల్స్ రూపొందించేందుకు ఉపయోగిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక చివరకు ఆ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించడంతో లాగ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే కళాశాలలో తన సీనియర్ అని తేలింది.
- ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్రం ఇటీవల ఓ అశ్లీల వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. కొందరు ఆమెకు సమాచారం ఇవ్వడంతో ఆ సైట్ చూసి హతాశురాలైంది. ఫొటో కింద ఆమె ఫోన్ నెంబరు కూడా ఉండడంతో దానికి విపరీతంగా ఫోన్లు రావడం మొదలైంది. ఫోన్లు చేస్తున్న వారు అసభ్యంగా మాట్లాడటంతో భరించలేకపోయింది. పరువు పోతుందనే భయంతో మిన్నకుండడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో ఆమె సహ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడని బయటపడింది. తనను ప్రేమించడం లేదనే అసూయతోనే ఇదంతా చేసినట్లు పోలీసులు వెల్లడించాడు.
అశ్లీల సైట్లలోనూ పోస్టు చేస్తున్నారు
సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలను తీసుకుని నేరగాళ్లు వాటిని మార్ఫింగ్ చేస్తూ బాధితుల స్నేహితులు, బంధువులకు షేర్ చేస్తున్నారు. వాటిని అడ్డుపెట్టుకుని నగ్నంగా వీడియో కాల్స్ చేయమనీ, ఫొటోలు పంపమని మోసగాళ్లు ఒత్తిడి చేస్తున్నారు.
- సమస్య అంతటితో పరిష్కారం అవుతుందని, ఆ వ్యక్తి చెప్పినట్లే చేస్తున్నారు కొందరు. కానీ ఆ తర్వాత కూడా వేధింపులు ఆగడం లేదు.
- అడిగినంత డబ్బు పంపాలనీ, లేకుంటే వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారు.
- ఇలా మోసగాళ్ల బారిన పడుతున్న మహిళలు, యువతులు నానాటికీ పెరుగుతున్నారు.
- వీరిలో పదో వంతు మందే ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
- చాలా మంది పరువు పోతుందనే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.
- ఈ విషయం భర్త, తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం వెనకాడటం లేదు.
- ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలను, మ్యాట్రిమోనీ సైట్లలో ఫొటోలను సేకరించి వాటిని డేటింగ్, పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
- నిందితుల్లో ఎక్కువ మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు.
లోన్యాప్ బెదిరింపులా? - ఇలా రక్షించుకోండి!
అలసత్వం వద్దు
- సోషల్ మీడియా ఖాతాలకు ప్రైవసీ సెట్టింగ్స్ పక్కాగా ఉండాలి. పాస్వర్డ్లను అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో కలిపి పెట్టుకోవాలి.
- వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలను ఆన్లైన్లో షేర్ చేయొద్దు. అవసరమైన ఆ మేరకే అనుసంధానం ఇవ్వాలి.
- గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను ఆమోదించకూడదు.
- ఖాతాలకు ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటే దానిని ఎవరూ షేర్ చేసుకునే అవకాశం లేకుండా చూసుకోవాలి. దీనికి ప్రొఫైల్ లాక్ సెట్ చేసుకోవాలి.
వేధింపులు, అఘాయిత్యాలకు బెదరొద్దు - అందుబాటులో వన్స్టాప్ సెంటర్