కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల నిర్వహణలో ఎటువంటి మార్పులు అవసరమన్న దానిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అపోలో/కాంటినెంటల్, మంగళగిరి ఎయిమ్స్ను సందర్శించి రోగులకు అందించే సేవలు, పర్యవేక్షణ యంత్రాంగం ఎలా ఉందన్న దానిపై పరిశీలించారు. ఈ ఆసుపత్రుల స్థాయికి తగ్గట్లు బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో చర్యలు తీసుకోవాలంటే అదనంగా ఏడాదికి రూ41.3 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 1,150 మంది ఉద్యోగులను అదనంగా నియమించాల్సి ఉంటుందని గుర్తించారు.ప్రభుత్వాసుపత్రుల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే రోగులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఎయిమ్స్లో రోజు 7 సార్లు నిర్ణీత మోతాదులో రోగులకు ఆహారాన్ని ఇస్తున్నారు. ఇతర కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5 నుంచి 7 సార్లు ఇస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో జనరల్ డైట్ కింద రూ.36, హై ప్రొటీన్ కింద రూ.56 వ్యయం అవుతుంది. ఎయిమ్స్లో రూ.135, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.140 నుంచి రూ.160 మధ్య ఖర్చు చేస్తున్నారు.
పటిష్ఠంగా ఇంజినీరింగ్ విభాగాలు
ఎయిమ్స్, అపోలో ఆసుపత్రుల్లో ఇంజినీరింగ్ విభాగాలు పటిష్ఠంగా ఉన్నాయి. వీటిల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్లు ఉన్నారు. పరికరాల పనితీరును నిత్యం బయోమెడికల్ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్, ఇతర అవసరాల కోసం ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రతి పనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్ ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్ఎంఓ హెచ్ఓడీ, సివిల్ సర్జన్ల పర్యవేక్షణలో హౌస్ కీపింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
2 నిమిషాల్లో రెస్పాన్స్ టీం
ఎయిమ్స్లో అత్యవసరమైనప్పుడు రెండు నిమిషాల్లో ‘క్విక్ రెస్పాన్స్ టీం’ వచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పరికరం చెడిపోతే 48 గంటల్లో మరమ్మతులు చేయాలి. లేకుంటే రోజుకి రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఎయిమ్స్లో రూ.4000 వరకు ఉంది. వ్యర్థాల విభజన, వాహనాల్లోనికి ఎక్కించడం, తరలించడంలో ఎయిమ్స్, కార్పొరేట్ ఆసుపత్రులు అనుసరిస్తోన్న వైనాన్ని అధికారులు పరిశీలించారు. సెక్యూరిటీ, ఫైర్సెఫ్టీ, ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు, వారి అర్హతలు, బాధ్యతలు, నిర్వహణ తీరు, ప్రయోజనాలు, ఇతర అంశాలను అధికారులతో చర్చించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న వార్డుల ప్రతిపాదికన హై, మీడియం, లో రిస్క్లో ఉన్నాయో గుర్తించి పరిశుభ్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ఇదీ చదవండి: ఎయి‘డెడ్’తో ఫీజులుం.. ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత నిర్ణయంతో ఆందోళన