కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుదుటపడకపోవడమే ప్రాజెక్టుల మందగమనానికి ప్రధాన కారణమవుతోంది. ప్రాజెక్టుల పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఉంది. ఏటా నవంబరు నుంచి జూన్ మూడో వారం వరకు నిర్మాణాలకు అనువైన కాలం. ఈ వ్యవధి సమర్థ వినియోగానికి వివిధ సవాళ్లు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఒక్క సాగునీటి రంగంలోనే దాదాపు రూ.7వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. వర్క్స్ అకౌంట్లకు సంబంధించి మూడేళ్లుగా రూ.14 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి రానందున తిరిగి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని, వడ్డీల భారమూ పెరుగుతోందని గుత్తేదారులు వాపోతున్నారు.
* 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు ఏ ప్రాజెక్టులు చేపట్టాలో, ఏవి నిలిపేయాలో తేల్చేందుకు 7,8 నెలలు పట్టింది. దాంతో ఆ సీజన్లో కొంత మేర నష్టపోవాల్సి వచ్చింది. 2020 మార్చి నుంచి కరోనా కారణంగా వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడంతో ప్రాజెక్టులు ఆగాయి. 2020 నవంబరు నుంచి తిరిగి పనుల సీజన్ ప్రారంభమైనా కరోనా అనంతర ఆర్థిక పరిస్థితుల ప్రభావం కనిపించింది. ఐదేళ్లలో రూ.96,550 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టేలా కొత్త ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. గత ప్రభుత్వ హయాంనాటికి నిర్మాణంలో ఉన్నవాటిల్లో 48 ప్రాజెక్టులను 3 ప్రాధాన్య విభాగాలుగా విడగొట్టి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇవిగాక 5 భారీ ప్రాజెక్టులకు ప్రణాళిక రచించింది. వేటికవే స్పెషల్పర్పస్ వెహికల్ ఏర్పాటుచేసి బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి చేస్తున్న రుణ ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. 48 పాత ప్రాజెక్టులకు రూ.24,092 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 2020-21 సీజన్లో రూ.3,882 కోట్లు వెచ్చించాలని లెక్కించారు.
వచ్చే 3నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
ప్రస్తుతం రెండో సీజన్లో జూన్ నెలాఖరువరకు ఓటాన్ అకౌంట్ కాలమే. వర్క్స్అకౌంట్లకు సంబంధించి బడ్జెట్ ఉంటేనే బిల్లులు సమర్పించాలని మార్గదర్శకాలిచ్చారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చినా నిధులు ఇవ్వనందున.. ఇక ఓటాన్ అకౌంట్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులెలా ఇస్తారని అధికారులే అనుమానిస్తున్నారు.
* గతంలో మొదట సమర్పించిన బిల్లు మొదట చెల్లించాలనే విధానం ఉండేది. నాలుగేళ్ల కింద ఈ విధానంలో మార్పు చేసి ప్రాధాన్య ప్రాజెక్టులకు తొలుత చెల్లింపులను ప్రారంభించారు. దీంతో ఏ గుత్తేదారుకు బిల్లు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కరోనా వల్ల రాష్ట్రం రూ.21,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ చెబుతోంది. గత ప్రభుత్వం రూ.వేల కోట్ల బిల్లులను పెండింగ్లో ఉంచినందున ప్రస్తుతం వాటన్నింటినీ సర్దుబాటు చేస్తూ ముందుకెళ్లాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
కొనసాగుతూనే..
* నెల్లూరు, సంగం బ్యారేజీలు (2020 నవంబరు), వంశధార నాగావళి అనుసంధానం (2020 డిసెంబరు), అవుకు టన్నెల్, వంశధార రెండో దశ, వెలిగొండ టన్నెల్2 హెడ్వర్క్స్ (2021 మార్చి) తదితర పనులను గత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని జలవనరులశాఖ లక్ష్యం. వాటి పనులు కొనగుతున్నాయి.
* వెలిగొండ మొదటి టన్నెల్ను నిర్మించారు.
* పోలవరం కొనసాగుతోంది.
* వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం పనులు జరుగుతున్నాయి.
* మిగిలిన అనేక ప్రాజెక్టుల పనుల్లో కదలిక లేదు.
ఇదీ చదవండి: