తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్లో ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో హుజూరాబాద్లో భాజపా, తెరాస మధ్య మాటలయుద్ధం మరింత తీవ్రమైంది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఈసీకి లేఖ రాసింది మీరంటే.. మీరే అంటూ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతున్నారని భాజపా ఆరోపిస్తుండగా.. ఎన్నికల సంఘానికి ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడం వల్లే పథకం తాత్కాలికంగా నిలిచిందని తెరాస చెబుతోంది.
కడుపు మంటతోనే లేఖ..
జమ్మికుంటలో జరిగిన ధూంధాం కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. దళిత బంధు పథకం ఆపాలని ఎన్నికల కమిషన్కు భాజపా లేఖ ఇచ్చినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రుజువు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. పథకం కారణంగా గెల్లు శ్రీనివాస్కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అనే కడుపు మంటతోనే లేఖ రాశారని అరోపించారు. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్న హరీశ్.. ఎన్నికల తర్వాత ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ట్రిపుల్ ఆర్ సినిమానే..
శాయంపేటలో ఈటల తరఫున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈటల రాజేందర్ను గెలిపించి న్యాయం పక్షాన నిలబడాలన్నారు. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్.. ఈ నెల 30వ తేదీన తెరాసకు ట్రిపుల్ ఆర్ సినిమా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, రామకృష్ణాపూర్లో ఈటల రాజేందర్ ఓట్లు అభ్యర్థించారు. తనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి తెరాస కళ్లు మండుతున్నాయని ఈటల ఆరోపించారు. అందువల్లే కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను కులాలు, వృత్తుల వారీగా విభజించి డబ్బు పంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వాళ్లిద్దరూ తోడుదొంగలే..
ప్రజల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ను గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కోరారు. జమ్మికుంట మండలంలోని పాపాయిపల్లి, పాపక్కపల్లి గ్రామాల్లో వెంకట్తో కలిసి ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదన్నారు. భాజపా, తెరాస తోడుదొంగలని విమర్శించారు.
ఇదీ చూడండి: