రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల పేర్లను ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని అత్యున్నతస్థాయి కమిటీ ఎంపిక చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన అత్యున్నతస్థాయి కమిటీ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్గా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మందాట సీతారామమూర్తి పేరును ప్రతిపాదించింది. జ్యూడీషియల్ సభ్యులుగా విశ్రాంత జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం పేరును, నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా న్యాయవాది గోచిపాత శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించింది. వీటిని రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదానికి పంపింది.
అత్యున్నతస్థాయి కమిటీ సమావేశానికి శాసన మండలి ఛైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ప్రతిపక్షనేత చంద్రబాబు, మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడులకు ఆహ్వానం పంపినా ఇరువురు సమావేశాన్ని బహిష్కరించారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ అయిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం 20 నిముషాల్లోనే ముగిసింది. ప్రతిపక్ష నేతలు ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవటంతో సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లనే అత్యున్నత స్థాయి కమిటీ ఎంపిక చేసి వాటిని గవర్నర్ ఆమోదానికి పంపింది.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తర్వాత తొలిసారిగా విభజన తర్వాత ఏపీలో తొలిసారిగా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే మానవహక్కుల కమిషన్ పనిచేస్తున్నప్పటికీ.. జస్టిస్ ఖక్రూ పదవీ విరమణ అనంతరం కాకుమాను పెద పేరిరెడ్డి కమిషన్కు ఇంఛార్జి ఛైర్మన్గా వ్యవహరించారు. సభ్యుల పదవులు ఖాళీగా ఉండిపోయాయి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ ఎంపికతో పూర్తిస్థాయిలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ పనిచేయనుంది.
ఇదీ చదవండి: కరోనా నివారణ చర్యలను.. ప్రధానికి వివరించనున్న సీఎం