రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్లు వాదనలు వినిపించారు.
చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని వారు కోర్టుకు తెలిపారు.
ఫిర్యాదు చేయకుండా...కేసు ఎలా నమోదు చేస్తారు?
ఫిర్యాదు, స్టేట్మెంట్లు ఉన్నాయి..ఇంకేం ఆధారాలు కావాలని సీఐడీ...కోర్టును అడిగింది. స్పందించిన న్యాయమూర్తి... రైతులు నష్టపోలేదు కదా? సీఆర్డీఏ వాళ్లు కూడా ఫిర్యాదు చేయలేదు కదా? అని సీఐడీని ప్రశ్నించారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా నమోదు చేస్తారని సీఐడీని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. అసైన్డ్ రైతులకూ పరిహారం అందింది కదా అన్న హైకోర్టు....సీఆర్డీఏ సెక్షన్ 146 మేరకు అధికారులను ఎలా విచారిస్తారని ప్రశ్నించింది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ స్టేట్మెంట్ను ప్రభుత్వం ప్రస్తావించింది. ఇదంతా కేవలం నిర్లక్ష్యమేనని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారాయణపై విచారణకు మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చిందని...మిగతా అధికారులపై విచారణ కొనసాగించవచ్చని అదనపు ఏజీ తెలిపారు. జీవో 41 మేరకు మొత్తం విచారణపై స్టే ఇవ్వాలని న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. తమ ముందుకొచ్చిన 2 పిటిషన్లపైనే స్టే ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: