తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన ఓ వివాహిత తన భర్త నాగుల రాజు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల గోదావరిఖనిలో చెరుకు రాజు అనే భూతవైద్యుడిని ఆశ్రయించింది. సదరు వ్యక్తి పూజల ద్వారా రాజు ఆరోగ్యం బాగుచేస్తానని చెప్పి మొదట రూ.10 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత మరో 10 వేలు తీసుకున్నాడు.
మళ్లీ పూజలు చేయాలని.. అందుకు మహిళను ఒంటరిగా రావాలని సూచించాడు. ఆమె రాకపోవడం వల్ల గత నెల 29న భర్త లేని సమయంలో రాజు రైల్వే రడగంబాల బస్తీలోని వివాహిత ఇంటికి వచ్చాడు. పూజలు చేయాలని రూ.15 వేలు తీసుకున్నాడు. అనంతరం ఒంటరిగా ఉన్న ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు రాజు ముందస్తు బెయిల్ కోసం బెల్లంపల్లికి వస్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ ఏరియాలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పూజలు చేస్తానని చెప్పే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామీణ సీఐ జగదీష్ సూచించారు.