ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును మదింపు చేసి గ్రేడ్లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి ‘అకడమిక్ పర్ఫార్మెన్స్’గా పేరుపెట్టింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో బుధవారం దీనిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పనితీరు మదింపునకు ఎంచుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు విడిగా గ్రేడ్లు ఇస్తారు. వీరందరి గ్రేడ్లను కలిపి పాఠశాలకు ఒక గ్రేడ్ నిర్ణయిస్తారు. ఆ తర్వాత మండలం, జిల్లా గ్రేడ్లు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ఏడాదికోసారి జరుగుతుంది. ఉపాధ్యాయులు పాఠ్యప్రణాళికలో ఎంతవరకు బోధించారు? విద్యార్థులపై పర్యవేక్షణ, డ్రాపౌట్స్, వెనుకబడిన పిల్లలకు పునశ్చరణ తరగతులు, ప్రత్యేక దృష్టి, విద్యార్థులకు ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో వస్తున్న మార్కులు తదితరాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దాదాపు 10-15 సూచికలతో అకడమిక్ పనితీరును అంచనా వేయనున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా ఆన్లైన్లో పర్యవేక్షించేలా వారం పది రోజుల్లో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయనున్నారు.
పదోన్నతులు కల్పించండి: ఒంటేరు
ఆదర్శ పాఠశాలల్లోని ట్రైన్డ్, పోస్టు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కార్యదర్శి రవీంద్రనాథ్రెడ్డికి ఆదర్శ పాఠశాలల ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి వినతిపత్రం సమర్పించారు. సర్వీసు నిబంధనల రూపకల్పనలో జాప్యం కారణంగా ఉపాధ్యాయులు ప్రయోజనాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: