హైదరాబాద్ కోఠిలోని గోకుల్చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పేలుళ్లు జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తైన సందర్భంగా... గోకుల్ చాట్ వద్ద మృతులకు పలువురు నివాళులర్పించారు. పేలుళ్లలో అవయవాలు కోల్పోయి బాధలు పడుతున్న వారికి... ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరారు. నిందితులకు న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈకేసులో ఇద్దరు నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
కోఠిలోని గోకుల్చాట్వద్ద, లుంబినీ పార్కువద్ద పేలుళ్లు జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తైంది. కోఠిలో 33 మంది మృతి చెందారు. ఎంతో మంది క్షతగాత్రులుగా మిగిలారు. కానీ ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేదు. ఘటనకు పాల్పడిన వారిని జైళ్లలో పెట్టి పెంచుతున్నారు. 14ఏళ్ల నుంచి ఎంతమందికి విజ్ఞప్తి చేస్తున్నా నాకు న్యాయం జరగడం లేదు. బాంబుపేలుళ్లలో కంటిని కోల్పోయాను. 14 ఏళ్ల నుంచి సాయం కోసం పోరాడుతున్న నేను గుడ్డోడినా... సర్కారు గుడ్డిదా..?.. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. నిందితులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. -సయ్యద్ రహీమ్, జంటపేలుళ్ల బాధితుడు.