వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యకు సంబంధించి హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రుల కమిటీలు ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేరేందుకు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారని న్యాయవాదులు శివాజీ, మహేశ్వరరావు విచారణ ప్రారంభంలో తెలిపారు. వారి తరపున తాము వాదనలు వినిపించేందుకు అనుమతించాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్న ధర్మాసనం... అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ విజయవాడ గ్రామీణం, జక్కంపూడి ఎంపీపీ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ తరపున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం నిర్ణయంపై పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సంతోషంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు