ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 59 శాతం..ఫార్మసీలో 5శాతం, ఫార్మా-డీ లో 3 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. ఎంసెట్లో 1,32,997 మంది అర్హత సాధించగా..68,071 మంది ద్రువపత్రాలు పరిశీలనకు హాజరైనారు.
ఈబీసీ కోటాలో 9,556 సీట్లకు గానూ 4,092 మందికి ఈ ప్రవేశాలు కల్పించారు. ఇంజినీరింగ్ విభాగంలో 273 కళాశాలల్లో కన్వీనర్ కోటాలోని 1,01,691 సీట్లకు 60,106 భర్తీ అయ్యాయి. విద్యార్థులు సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచీల వైపే మొగ్గు చూపారు. సివిల్, మెకానికల్, ఈఈఈ గ్రూపులపై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. ఫార్మసీలో 119 కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని 3,925 సీట్లకు192 భర్తీ కాగా..3,733 సీట్లు మిగిలిపోయాయి. ఫార్మా-డీ విభాగంలోని 53 కళాశాలల్లో 587 సీట్లకు 17 మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 కళాశాలల్లో ఒక్క విద్యార్థి చేరకపోవడం గమనార్హం.
ఈ గణాంకాలను పరిశీలిస్తే 17 కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ కాగా..22 కాలేజీల్లో10 శాతం మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. స్టూడెంట్స్, తల్లిదండ్రులు ఎక్కువగా సాఫ్ట్వేర్ విద్యవైపే మొగ్గుచూపారు. సివిల్ , మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో ప్రాంగణ నియామకాలు తగ్గడమే ఇందుకు కారణం. కొందరు విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో విద్యనభ్యసించాలనుకోవడమూ ప్రభావం చూపింది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాల్లో ప్రారంభ వేతనలు తక్కువగా ఉంటున్నాయనే విద్యార్థులు ఈ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని విశ్లేషకుల మాటా. కౌన్సెలింగ్లో సీట్లు పొందిన వారు ఈ నెల 27లోపు కళాశాలల్లో చేరాలని ఎంసెట్ కన్వీనర్ ఎ. బాబు సూచించారు.
ఇవీ చదవండి...తెలంగాణ ఎంసెట్లో విజయవాడ కుర్రోడికి 2వ ర్యాంకు