వారంతా నిర్వర్తించేది ఒకే విధులు. కానీ శాశ్వత ఉద్యోగులకు వేతన భత్యాలు అన్నీ ఉంటాయి. ఒప్పంద ఉద్యోగులకు మాత్రం అవేవీ ఉండవు. 2016లో నియమించిన ఒప్పంద ఉద్యోగుల కంటే.. 2020లో నియమించిన వారికి వేతనాలు ఎక్కువ. అదేమంటే.. ఉన్నతాధికారులకు రాశాం.. రేపు మాపు వస్తాయంటున్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద నర్సుల పరిస్థితి ఇది. 2016లో నియమించిన వారికి నెలకు రూ.22,500 వేతనం ఇస్తున్నారు. 2020లో నియమించిన వారికి రూ.34వేలు చొప్పున ఇస్తున్నారని, ఇదేమి వివక్షత అని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అయిదు రోజులుగా విజయవాడ జీజీహెచ్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
రోజంతా పీపీఈ కిట్లు ధరించి కరోనా రోగులకు సపర్యలు చేస్తారు. రోగులతోనే రోజులో సగం గడుపుతారు. కానీ వారికి ఎలాంటి భద్రత లేదు. కనీసం కొవిడ్తో మరణిస్తే మట్టిఖర్చులు ఇచ్చిన దాఖలాలు లేవు. కరోనా వచ్చి చికిత్స పొందితే.. కేవలం 14 రోజులు మాత్రమే సెలవు. అంతకు మించి సెలవు పెడితే వేతనంలో కోత. విజయవాడ జీజీహెచ్లో రజనీ అనే ఒప్పంద స్టాఫ్ నర్సు ఇటీవల కొవిడ్ సోకి మరణించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కుటుంబీకులు వాపోయారు. జీజీహెచ్లోనే కల్యాణి, దుర్గాభవానీ అనే స్టాఫ్ నర్సుల ద్వారా వారి భర్తలకు కొవిడ్ సోకింది. చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరు ఒంటరి వారయ్యారు. వారికి ఈపీఎఫ్ లేదు. ఎలాంటి అలవెన్సులు లేవు. కానీ శాశ్వత ఉద్యోగులతో సమానంగా విధులు మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. 2016లో రాష్ట్ర వ్యాప్తంగా డీఎంఈ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి 1100 మంది నర్సులను ఎంపిక చేశారు. మొదట వీరిని ఒప్పంద ఉద్యోగులుగా తీసుకున్నారు. జీజీహెచ్ విజయవాడలో 100 మందిని కేటాయించారు. వీరిలో 70 మంది మహిళలు, 30 మంది పురుషులు ఉన్నారు. వీరికి నెలకు రూ.22500 వేతనం నిర్ణయించారు. గత అయిదు సంవత్సరాలుగా ఇదే వేతనం చెల్లిస్తున్నారు. 2020లో డీఎంఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ నియామకాలు చేపట్టారు. మొత్తం 500 మందిని తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్కు 150 మందిని కేటాయించారు. వీరికి నెలకు వేతనం రూ.34వేలుగా నిర్ణయించారు. ఒకే పద్ధతిలో నియామకం చేసిన తమకు వేతనంలో వ్యత్యాసం ఎందుకని 2016లో నియమించిన నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొదటి దశలో జీజీహెచ్లో ఉన్న 100 మందిలో 30 మంది కొవిడ్ ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రం మొత్తం మీద 8 మంది స్టాఫ్ నర్సులు (ఒప్పంద ఉద్యోగుల్లో) మృతి చెందారు. కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు. కొవిడ్ సోకితే కనీసం నెల రోజులు ఇంటి వద్దనే ఉండాల్సి ఉంది. కానీ వీరికి 14 రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఉద్యోగం ఎక్కడ పోతుందోనని 15వ రోజునే విధులకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్స్పై విధులు ముగించిన తర్వాత నిరసన వ్యక్తం చేశారు. డీఎంఈ రాఘవేంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు.
సీఎం జగన్మోహన్రెడ్డికి పాదయాత్ర సమయంలో విజ్ఞప్తి చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాఫ్నర్సులను పర్మినెంట్ చేస్తామన్నారు. దీనిపై అధికారులు పట్టించుకోలేదు. సీఎం ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి. కొవిడ్ సెలవులు పెంచాలి.
- పార్వతి వెంకటరమణ, స్టాఫ్నర్సు
ఇదీ చదవండి:భూ కబ్జాకు పాల్పడిన వారు ఎవరైనా వదిలేది లేదు: మంత్రి అవంతి