Attack on customers at Bar: ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయించమని అడిగినందుకు కస్టమర్లపై దాడి చేశారు ఓ బార్ నిర్వాహకులు. దీంతో బార్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చొరవతో ఆందోళన సద్దుమణిగింది. హైదరాబాద్ మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్కు ఆదివారం రాత్రి ఇద్దరు కస్టమర్లు వచ్చారు. బీరు అధిక ధరలకు అమ్ముతున్నారు, ఎంఆర్పీ ధరలకు విక్రయించాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. దీంతో అది గొడవకు దారితీసి, దాడి చేసే వరకు వెళ్లింది. ఘర్షణలో సాయికృష్ణ అనే కస్టమర్కు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం బార్ ఎదుట ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ బార్ను ఓ వార్తా పత్రికకు చెందిన రిపోర్టర్ నిర్వహిస్తున్నారని.. బిహార్ వాసులను ఇక్కడ పనిలో పెట్టుకున్నారని.. ధరల విషయంలో ప్రశ్నించే కస్టమర్లపై దాడి చేయిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బార్ నిర్వాహకుడిపై ఆందోళనకారులు దాడి చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న మల్కాజిగిరి పోలీసులు.. బార్ నిర్వాహకుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. కస్టమర్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్యాంప్రసాద్ రావు చెప్పారు.
ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య ఘటనలో నలుగురు వడ్డీ వ్యాపారులపై కేసు