జగన్ పాలనలో ఆరోగ్య శాఖ అనారోగ్యంతో ఐసీయూలో ఉందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 108, 104 వాహనాలు ఎక్కడ ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆసుపత్రులను చేరవేయడంలో.. జాప్యం చేయడంతో బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విజయసాయిరెడ్డి లాంటి వైకాపా నాయకులు వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తూ.. ఆరోగ్యశాఖపై ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తున్నారన్నారు.
చిన్న రాష్ట్రమైనా.. కరోనా కేసుల్లో దేశంలో నాలుగో స్థానంలోకి వచ్చిందన్నారు. ధర్మవరం ఆసుపత్రి ఆవరణలో చెట్టు కింద ప్రాణాలు కోల్పోయిన రాజు అనే వ్యక్తిది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అన్నారు. ఇప్పటికైనా ఆరోగ్యశాఖపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని తులసిరెడ్డి సూచించారు.
ఇదీ చదవండి : సేవలు చేయించుకున్నాడు.. సేవలు చేసే భాగ్యం కోల్పోయాడు