విద్యా సంస్థల సమాచారం సేకరించి వాటి స్థితిగతులను ప్రజలకు తెలిసేలా చేసేందుకు చేపట్టిన చర్యలపై.. ప్రైవేటు విద్యా సంస్థలు కోర్టును ఆశ్రయించడం సమంజసం కాదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల సమాచారం తీసుకునే అధికారం కమిషన్కు ఉందని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఇచ్చిన ఓ నోటిఫికేషన్ పై కొంతమంది కోర్టుకు వెళ్లారని తెలిపారు. కమిషన్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల సమాచారం తీసుకునే అధికారం కమిషన్కు ఉండదా..? అని ప్రశ్నించారు. అన్ని విద్యాసంస్థలకు ఒకే ఆర్థిక స్థితి ఉండదన్న ఆయన... కమిషన్ ఎప్పుడు నియంత్రణకు ప్రయత్నిస్తుంది తప్ప...ఎవరిని ఇబ్బంది పెట్టబోదని స్పష్టం చేశారు.
ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోర్టు నిలిపివేసిందన్న ఆయన... దీని ప్రకారం ఇంతకుముందున్నదే అమలవుతుందని వెల్లడించారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు సమాంతరంగా అమలవుతాయని చెప్పారు. వాలంటీర్లు.. తల్లిదండ్రులను బలవంతంగా ఆంగ్ల మాధ్యమానికి ఒప్పించారని కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని..ఇలాంటివి సరికాదని అభిప్రాయపడ్డారు.
'ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులకు యాజమాన్యాలు పదే పదే సందేశాలు పంపిస్తున్నారు. ఫీజుల కోసం ఒత్తిడి తేవడం మంచిది కాదు. విద్యావిధానాన్ని మార్చడానికి ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారు. విద్యావిధానంపై ముఖ్యమంత్రికి నిబద్ధత ఉంది. 9వ తరగతిలోపు విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మంచిది. చిన్న తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించినంత మాత్రాన ఎలాంటి నష్టం ఉండదు. విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో ఉంచాలి. చిన్నప్పటి నుంచే ర్యాంకుల వేటలో ఉంచొద్దు' - జస్టిస్ కాంతారావు, పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్
ఇదీ చదవండి: