వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ను ఇక నుంచి ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ను ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ(AP RASCOM)గా మార్చాలని ఇంధన శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకుగానూ ఏపీ రాస్కమ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ap Rascom)గా పనిచేయనుంది.
అయితే 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి కోసం గతంలోనే ఏపీ గ్రీన్ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నిధులలేమి కారణంగా ఆ విద్యుత్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేయనుంది. ఈ విద్యుత్ను ఏపీ రాస్కమ్ ద్వారా వ్యవసాయానికి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతానికి పంపిణీ నెట్వర్క్ లేనందువల్ల రాష్ట్రంలోని 3 డిస్కమ్లకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థనే రాస్కమ్ వినియోగించుకునేలా నిర్ణయించారు.
మూడు డిస్కమ్లకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని పంపిణీ లైన్లు వినియోగించుకున్నందుకు గానూ.. ఏపీ రాస్కామ్ వీలింగ్ ఛార్జీలు చెల్లించనుంది. పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేవరకు డిస్కమ్లకు వీలింగ్ ఛార్జీలు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో ప్రస్తుత డిస్కమ్లు కుదుర్చుకోనున్న ఒప్పందాన్ని ఏపీ రాస్కామ్(AP RASCOM)కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలకు రాస్కామ్ చెల్లించే వీలింగ్ ఛార్జీలు.. విద్యుత్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ఫీడర్ సెగ్రిగేషన్ ఛార్జీలు, ఇతర వ్యయాన్ని ఎలక్ట్రిసిటీ డ్యూటీగా వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు.
AP Cabinet decisions : ఆన్లైన్లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్ జారీ