రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తున్నా.. రుణాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్(ఎస్డీసీ) ద్వారా మరో మూడు వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి రుణంగా తీసుకోనున్నారు. ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలను ఎస్డీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణ సమీకరణ చేసింది.
ఆర్థిక శాఖ ఆందోళన
మొత్తంగా 25 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక వనరుల్ని సమీకరించటం లక్ష్యంగా ఎస్డీసీ ఏర్పాటైంది. అవసరమైనంత మేర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. ఈ కార్పొరేషన్కు ఎస్బీఐ ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. అలాగే మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు సమకూర్చాయి. ఇప్పుడు తాజాగా మరో 3 వేల కోట్లను ఎస్బీఐ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ సంస్థ ఏర్పాటైన ఏడాదిలోపే ఇన్ని వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకోవటంపై ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది.
నిధుల వినియోగం ఇలా
ఎస్డీసీ సమీకరించిన ఆర్థిక వనరుల నుంచి ఉద్యోగుల జీతాలతో పాటు కరోనా కారణంగా పెండింగ్లో ఉంచిన 4300 కోట్ల రూపాయల జీతాల బకాయిలు చెల్లింపులు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలను కూడా 2021 జనవరి నుంచి ఈ నిధుల నుంచే చెల్లించనున్నారు. ఇక జనవరి 9 తేదీన అమ్మ ఒడి పథకం కింద 6100 కోట్ల రూపాయల్ని కూడా ఈ కార్పొరేషన్ నిధుల నుంచే సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నెల వారీగా ప్రభుత్వ ఆదాయం 11 వేల కోట్ల రూపాయలైతే... కేంద్రం నుంచి వచ్చే మరో 3 వేల కోట్ల రూపాయలతో కలిపి 14 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చులకు, పథకాలకు సర్దుబాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి