ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమ సంపాదన ఉదంతంపై అనిశా అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆగస్టు 18న అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ ఇంట్లో తుపాకులున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు నాగలింగం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో పోలీసులే నిర్ఘాంత పోయేలా ఎనిమిది ట్రంకు పెట్టెల్లో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు బయటపడ్డాయి. మనోజ్ కారు డ్రైవర్ నాగలింగాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. కిలోన్నర వరకు బంగారం, 84 కిలోల వెండి వస్తువులు ట్రంకు పెట్టోల్లో గుర్తించారు. ఇవికాకుండా పలువురికి అప్పులు ఇచ్చిన 27 లక్షల రూపాయల విలువైన ప్రామిసరీ నోట్లు, 49 లక్షల రూపాయల విలువైన బ్యాంకు డిపాజిట్ల ఓచర్లు సైతం పోలీసులు గుర్తించారు.
మనోజ్ అవినీతికి సంబంధించి అనేక కోణాలు ఉండటంతో పోలీసులు ఈ కేసును అనిశాకు బదిలీ చేశారు. కోర్టు ఉత్తర్వులతో రంగంలోకి దిగిన అనిశా అధికారులు.... అనంతపురంలో ఐదు చోట్ల ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఉదయాన్నే అనంతపురం ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన అనిశా అధికారులు... మనోజ్ దస్త్రాలు భద్రపరిచిన బీరువా తాళాలు తెరిపించి ఫైళ్లు పరిశీలించారు. మనోజ్ ఇంట్లో, స్నేహితుడు నాగార్జున, డ్రైవర్ నాగలింగం నివాసాల్లో కూడా అనిశా సోదాలు నిర్వహించింది. మనోజ్ వేధిస్తున్నాడనే ఆరోపణలతో పోలీసు కేసులు పెట్టి, కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన ఆయన భార్య ఇంట్లో కూడా సోదాలు చేసి, వివరాలు తెలుసుకున్నారు.
ఖరీదైన పౌష్ఠికాహారం.. డ్రైప్రూట్స్..
గుర్రాలు పెంచుతూ, గుర్రపు స్వారీలు, ఖరీదైన హార్లీ డేవిడ్ కంపెనీ ద్విచక్ర వాహనం నడపటమంటే మనోజ్ కు చాలా సరదా అని విచారణలో ఆసక్తికర విషయాలను రాబట్టారు. నిత్యం కొందరు యువకులను వెంటబెట్టుకొని, వారికి డ్రైఫ్రూట్స్, ఖరీదైన పౌష్ఠికాహారం తినిపిస్తూ ఉండేవాడని కూడా మనోజ్ స్నేహితులు అనిశా అధికారులకు చెప్పారు. దీర్ఘకాలంగా అనంతపురం ట్రెజరీలో పనిచేస్తున్నారని, మనోజ్ ను ధర్మవరం ఖజానా కార్యాలయానికి బదిలీ చేయగా, ఆయన అక్కడి పనిచేయలేదు. నాలుగు నెలల పాటు సెలవుపెట్టి, మళ్లీ అనంతపురం ట్రెజరీకే బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు ఖజనాశాఖ అధికారులు చెబుతున్నారు.
పెద్దగా మాట్లడటం లేదు....
కార్యాలయంలో తోటి ఉద్యోగులతో పెద్దగా మాట్లాడేవాడు కాదని, కనీసం కలిసి వెలుపలికి వెళ్లి టీ కూడా తాగేవాడు కాదని మనోజ్ గురించి పలు విషయాలు ట్రెజరీ అధికారులు అనిశాకు చెప్పారు. వివిధ పనుల మీద ట్రెజరీకి వచ్చే ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారికి దరఖాస్తులు పూరించి ఇవ్వటం మొదలు, ఆర్థిక ప్రయోజనాలు తెప్పించే వరకు ప్యాకేజీలు మాట్లాడుకొని మామూళ్లు వసూలు చేసేవాడని కూడా అనిశా విచారణలో తెలిసింది. మనోజ్ ఆస్తులు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఈ కేసు దర్యాప్తు పూర్తి కావటానికి మరికొన్ని రోజులు పడుతుందని అనిశా అధికారులు చెప్పారు.
మనోజ్ ను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన అనిశా అధికారుల బృందం, బంగారు, వెండి, ప్రాంసరీ నోట్లు, బ్యాంకు డిపాజిట్ల వ్యవహారం మొదలు ఖరీదైన కార్లు, బైక్ ల వ్యవహారం మొత్తం విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: