ఎంబీబీఎస్లో ద్వితీయ కౌన్సెలింగ్ ద్వారా చేసిన సీట్లు కేటాయింపు రద్దయింది. ఆన్రిజర్వుడు కేటగిరీలో సీట్ల కేటాయింపులో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు నష్టపోయారు. కౌన్సెలింగ్పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పునఃపరిశీలించిన విశ్వవిద్యాలయం తప్పును గుర్తించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీట్ల కేటాయింపును రద్దుచేసింది. ఇప్పటికే పలు కళాశాలల్లో విద్యార్థులు చేరడంతో తాజా పరిణామం వారిని కంగారుపెడుతోంది.
నిబంధనల ప్రకారం 85% సీట్లను స్థానిక, 15% సీట్లను ఆన్రిజర్వుడు కోటాలో భర్తీ చేయాలి. ఈ విధానంలోనే తొలి విడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు సంబంధిత వైద్య కళాశాలల్లో చేరకపోతే వాటిని మలివిడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఇలా చేసే క్రమంలోనే పొరపాటు జరిగింది. ఇచ్చిన ఐచ్ఛికాల(ఆప్షన్స్) ప్రకారం... కేటాయింపు లేనందున విద్యార్థులు విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. ఎంబీబీఎస్లో ప్రతి సీటూ ముఖ్యమైన నేపథ్యంలో విశ్వవిద్యాలయం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మలివిడత కౌన్సెలింగ్లో సుమారు 175 సీట్ల భర్తీకి చర్యలు తీసుకున్నారు.
వారికే కేటాయించాలి...
ఆన్రిజర్వుడు కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు కళాశాలల్లో చేరకపోతే ఆ తర్వాత మెరిట్లో ఉన్న వారికి కేటాయించాలి. మెరిట్లో ఉన్న వారు స్థానిక కోటాలో అప్పటికే సీట్లు పొందినట్లైతే వీరిని ఆన్రిజర్వుడు కోటాలోకి తేవాలి. అనంతరం ఖాళీ అయ్యే వాటిని స్థానిక కోటాలో భర్తీ చేయాలి. ఇక్కడే పొరపాటు జరిగి గందరగోళం ఏర్పడింది. ఆంధ్ర వైద్య కళాశాలలో 15 శాతం ఆన్రిజర్వుడు కోటాలో 14 మందికి సీట్లు కేటాయించగా ముగ్గురు చేరలేదు. నిబంధనల ప్రకారం ఈ మూడు సీట్లను మెరిట్లో ఉన్న విద్యార్థులకు కేటాయించాలి. వీరు అప్పటికే స్థానిక కోటాలో సీట్లు పొంది ఉంటే వారిని ఓపెన్లో కేటగిరిలోకి తేవాలి. అనంతరం ఖాళీ అయ్యే ఆ సీట్లను స్థానిక కోటాలో కేటాయించాలి. అధికారులు ఇలా చేయకుండా ఓపెన్ కేటగిరీని ప్రత్యేకంగా చూపిస్తూ ర్యాంకుల్లో వెనుకున్న వారికి సీట్లు కేటాయించారు. ఫలితంగా స్థానిక కోటాలో ఉండే విద్యార్థులు నష్టపోయారు.
కోడింగ్లో తప్పిదం...
విద్యార్థుల ఫిర్యాదులపై పరిశీలన చేపట్టాం. సాంకేతికంగా పొరపాటు జరిగిందని గుర్తించాం. మలివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును రద్దుచేశాం. మళ్లీ మంగళవారం సీట్లుకేటాయిస్తాం. సాఫ్ట్వేర్ కోడింగ్లో తప్పిదం చోటుచేసుకుంది. ఇప్పటికే విద్యార్థులు కళాశాలల్లో చేరి ఉంటే ఆ సీట్లు రద్దయినట్లే. మంగళవారం కేటాయించే సీట్లనే పరిగణనలోనికి తీసుకోవాలి. ఈ ప్రక్రియలో మెరిట్ విద్యార్థులకు ఎటువంటి నష్టమూ జరగదు.' - డాక్టర్ శ్యాంప్రసాద్, ఉపకులపతి, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
ఇదీ చదవండి