Electric Shock at Ganesh Mandapam : వినాయక చవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గణేశ్ మండపాల వద్ద విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటనలు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకెళ్తే మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం రాజీపేట గ్రామంలో గణేశ్ మండపం వద్ద చెత్తను తీసివేస్తుండగా విద్యుత్ తీగలను తాకడంతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పోచయ్య (60) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గోప్య తండాకు చెందిన భూక్యా సంజీవ్ అనే విద్యార్థి వినాయకుడి మండపం వద్ద సౌండ్ సిస్టంను సరిచేస్తుండగా విద్యుదాఘాతంలో మృతి చెందాడు. హుటాహుటిన కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంజీవ్ కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.