A Poor Man Living In A Bathroom : 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే బతుకు పోరాటం సాగిస్తున్నారు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన 51 ఏళ్ల పెరుగు లింగయ్య. కుష్ఠు వ్యాధి బాధితుడైన ఆయన, కనీసం పింఛనుకూ నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఆయన భార్య లక్ష్మి అనారోగ్యంతో మరణించగా, ఏకైక కుమారుడు వారి అమ్మమ్మ వద్ద పెరిగి అక్కడే ఉంటున్నారు.
దీంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న లింగయ్య పూరి గుడిసె కూలిపోవడంతో ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డినే ఆవాసంగా మార్చుకున్నారు. 4 అడుగుల ఆ గదిలో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యంతో పనికి వెళ్లలేని పరిస్థితి. రేషన్ బియ్యంతో అన్నం వండుకుని, భిక్షాటనతో కూరలు తెచ్చుకుంటారు. తన దయనీయ స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఇల్లు, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.