Young Woman Killed for Land Property : ఆస్తి కోసం యువతిని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసిన ఆమె అక్కాబావలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తిలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తండ్రి అకాల మరణం చెందగా తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. వీరికి 12 గుంటల భూమి ఉంది. దీనిపై యువతి బావ ఆంజనేయులు కన్నేశాడు.
ఈనెల 14న రాత్రి యువతి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె మెడకు చున్ని బిగించి దూలానికి వేలాడదీశాడు. ఈ జరిగిన విషయం మొత్తం భార్యకు చెప్పాడు. వారిద్దరు ఏం తెలియనట్లు నటించి యువతి అంత్యక్రియలకు వెళ్లారు. మృతురాలి మేనమామ పోలీసులకు ఫిర్యాదుచేయగా దర్యాప్తు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు.