16th Finance Commission Telangana tour : నిధుల సిఫార్సునకు 16వ కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో తన కసరత్తు ప్రారంభించింది. అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిషన్ రెండు రోజుల పాటు ప్రజాభవన్లో సమావేశాలు నిర్వహించనుంది. 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి కమిషన్ సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఇవాళ, రేపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఎస్ఎఫ్సీ, వర్తక సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశం కానుంది. పట్టణ ప్రాంత, స్థానిక సంస్థల ప్రతినిధులతో కమిషన్ మొదట సమావేశమైంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు దానకిషోర్, సందీప్కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. కేంద్రనిధులలో రాష్ట్రానికి మరింతగా వాటాను పెంచాలని ఆర్ధికసంఘానికి విజ్ఞప్తిచేశారు.