Vietnam Death Toll : ఆగ్నేయాసియా దేశం వియత్నాంలో యాగి తుపాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మృతుల సంఖ్య 197కు పెరిగింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 800 మందికి పైగా గాయపడ్డారని, 125 మందికి పైగా ఆచూకీ ఇంకా దొరకలేదని అక్కడి మీడియా పేర్కొంది. ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్లోని లాంగ్ను కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
రెడ్ నదిలో వరద ఉద్ధృతి తగ్గినప్పటికీ రాజధాని హనోయిలో చాలా ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పలుచోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది. కొందరు ప్రజలు పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. యాగి తుపాను శనివారం వియత్నాం తీరం దాటిన సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల 30లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.