Rajya Sabha Election 2024 : రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో పలువురు లోక్సభ ఎంపీలుగా ఎన్నికవడం, రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్లకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది.