Mamata On RG Kar Protests : కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచారంపై జరుగుతున్న నిరసనలు- కేంద్ర ప్రభుత్వం కుట్ర అని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అరోపించారు. ఇందులో వామపక్ష పార్టీల హస్తం కూడా ఉందన్నారు. దుర్గా పూజ సమీపిస్తున్నందున ప్రజలందరూ ఉత్సవాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్లందరూ సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక, వైద్యురాలి తల్లిదండ్రులకు తాను డబ్బు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను మమత ఖండించారు. తానెప్పుడు డబ్బు ఆఫర్ చేయలేదన్నారు. కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారని, కానీ దుర్గా పూజ సమీపిస్తున్న తరుణంలో తమకు లా అండ్ ఆర్డర్ తెలిసిన వాళ్లు అవసరమని చెప్పారు.