FIR against AAP workers : తిహాడ్ జైలు నుంచి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలైన సంబరంలో ఆప్ కార్యకర్తలు టపాసులు కాల్చడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా కేజ్రీవాల్ శుక్రవారం రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. తమ నాయకుడు జైలు నుంచి బయటకి వచ్చిన ఆనందంలో ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని టపాసులు కాల్చారు. బాణసంచా వినియోగంపై దిల్లీలో నిషేధం ఉండటం వల్ల పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద పలువురిపై కేసులు నమోదు చేశారు.
దిల్లీలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ విక్రయాలపై గత సోమవారం దిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిర్ణయం జనవరి 1 వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో బాణాసంచా క్రయవిక్రయాలకు సైతం నిషేధాజ్ఞలు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.