By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 3:04 PM IST
25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి - 'మేం మోసపోయాం' అంటూ నిరుద్యోగుల ఆందోళన
Unemployees Protest That Mega DSC in Vizianagaram: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించాలని విజయనగరంలో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విజయనగరం కోట వద్ద ఆందోళన చేపట్టారు. తాము మోసపోయామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి రాగానే 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులను నట్టేంట్లో ముంచేశారని పేర్కొన్నారు.
ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తూ నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ 2వేలు, 3వేల పోస్టులను విడుదల చేసి సరిపెట్టకుండా మెగా డీఎస్సీనే ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రకటించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులను రోడ్డు ఎక్కకుండా చేస్తామని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధిని ప్రచారం చేయకుండా ఆటంకం కల్పిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ను వెంటనే పరిష్కరించకపోతే 2024 ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.