By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 1:30 PM IST
'వైఎస్సార్సీపీ హయాంలో గౌరవ సభ కౌరవ సభలా మారింది- ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ రోజు'
Telugudesam MLAs and MLCs boycotted assembly meetings : తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల చివరి రోజును బహిష్కరించారు. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినాశక చట్టాలు చేసిందని ఆ ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బయట దహనం చేశారు. మూడు రాజధానుల చట్టం, మద్యం అమ్మకాల తాకట్టు, మీడియాపై ఆంక్షలు జీవోలను దహనం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రతులు, ఇతర ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రతులను కాల్చేశారు.
ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అసెంబ్లీ రోజు అంటూ నినాదాలు చేశారు. నేటితో రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం వదిలిపోయిందని తెలుగుదేశం నేతలు నినదించారు. ఐదేళ్ల శాసనసభ చీకటి సభేనని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చివరి రోజు కూడా యాత్ర సినిమా కోసం సభను 2గంటలు వాయిదా వేశారని మండిపడ్డారు. ఐదేళ్ల శాసనసభలో ప్రతీరోజూ బ్లాక్ డేనే అని అభివర్ణించారు. ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం శాసనసభలో మంటగలిసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో గౌరవ సభ కౌరవ సభలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కల్యాణ్ నేతృత్వంలో గౌరవ సభని పునరుద్ధరిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.