By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 12:00 PM IST
భూ హక్కు చట్టం అత్యంత ప్రమాదకరం - ప్రజలను చైతన్యం చేయాలి: మండలి బుద్ధప్రసాద్
TDP Leader Mandali Buddha Prasad on Land Rights Act : భూ హక్కు చట్టం ద్వారా నిర్ణయాత్మక అధికారాలు తహసీల్దార్ చేతుల్లో ఉంచటం అత్యంత ప్రమాదకరమని మాజీ ఉపసభాపతి, టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. భూ హక్కు చట్టం వల్ల కలిగే నష్టాలపై కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Land Rights Act in AP : భూ హక్కు చట్టంపై ప్రభుత్వమే వెనుకడుగు వేసేలా ఐక్యంగా కలిసి పోరాడుదామని మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే చట్టాలను ఉల్లంఘిస్తున్న పరిస్థితులు ఉన్నాయని, అవినీతికి అధికారులే ఆజ్యం పోస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్ కారణంగా ఎన్నో సమస్యలు వచ్చాయని, కేసీఆర్ ఓటమికి అదో ప్రధాన కారణమని పేర్కొన్నారు. తహసీల్దార్లు అధికారపార్టీకి కీలుబొమ్మలుగా మారారని, ఏ చట్టాన్నీ కాపాడే పరిస్థితిలో వారు లేరన్నారు. మట్టి, ఇసుక దందా, సీఆర్ జడ్ పరిధిలో తవ్వకాలను పట్టించుకోవటం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకురావటం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఆస్థులు ప్రజలచేతుల్లో నుంచీ వెళ్లిపోయే ప్రమాదం నెలకొందని, చట్టం గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూ హక్కు చట్టానికి వ్యతిరేఖంగా కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం జరిగిందనీ, స్టే రాకుంటే భవిష్యత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.