By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 2:43 PM IST
శ్రీకాళహస్తిలో ఘనంగా శయనోత్సవ వేడుకలు- భక్త జనసంద్రంగా మారిన ఆలయం
Shayanotsava Celebrations At Srikalahasti: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భాగంగా శయనోత్సవం నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి శాస్రోక్తంగా షాడోపచారాలు చేశారు. ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామిని వెండి పల్లకిలో పవళింపు ఉత్సవం చేపట్టారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలిరావటంతో ఆలయం భక్త జనసంద్రంగా మారింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 3న ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. మార్చి 16న శాంతి అభిషేక ఘట్టంతో ముగుస్తాయని ఆలయ ఈవో ఎస్.వి నాగేశ్వరరావు తెలిపారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.